జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోన్న బీహార్ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కాసేపటి క్రితం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నవంబర్ 14న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇక దేశ వ్యాప్తంగా ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు కూడా ఈ సందర్భంగా ఎన్నికలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణాలో ఖాళీ అయిన జూబ్లిహిల్స్ ఉప ఎన్నికను నిర్వహించనున్నారు.
Also Read : సామ్సన్ కు ఎందుకీ అన్యాయం..?
నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఉండనుంది. నవంబర్ 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉంటుంది. గరిష్టంగా ప్రతి 1,200 మందికి ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈవీఎంలపై తొలిసారి అభ్యర్థుల కలర్ ఫోటోలను వినియోగిస్తారు. దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటినుంచే ఓటు వేసే అవకాశం కల్పించనుంది. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల మొబైల్ ఫోన్ల కోసం కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
Also Read : ఆ ముగ్గురినీ వేటాడుతున్న బోర్డు..?
ఇక సోషల్ మీడియా విషయంలో కూడా గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామని ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉండగా ఎస్సీ రిజర్వుడు స్థానాలు 38, ఎస్టీ రిజర్వుడు స్థానాలు 2 ఉన్నాయి. నవంబర్ 22తో బీహార్ అసెంబ్లీ గడువు ముగుస్తున్న సంగతి తెలిసిందే. బీహార్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లు కాగా, పురుష ఓటర్లు 3.92 కోట్లు, మహిళా ఓటర్లు 3.5 కోట్ల మంది ఉన్నారు. 14 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకున్నారని, వందేళ్లు పైబడిన ఓటర్లు 4 వేల మంది ఉన్నట్టు తెలిపింది.