అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి ఆనంద్ బీజేపీలో చేరిన వ్యవహారం ఇప్పుడు రెండు పార్టీల మధ్య వివాదంగా మారింది. టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొన్న శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, తాజాగా ఆయన కుమారుడు చింతకాయల విజయ్ ఈ వ్యవహారంపై విరుచుకు పడ్డారు. దీంతో కూటమి పార్టీల మధ్య సమన్వయము లోపించినట్లు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని కార్యకర్తలు భావిస్తున్నారు. ఇక విషయానికి వస్తే..
విశాఖ డెయిరీ చైర్మన్గా ఉన్న అడారి ఆనంద్ వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి ఆయనకు కాషాయం కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఇక నుంచి ఆడారి.. తమ నాయకుడేనని ప్రకటించారు. ఈ వ్యవహారం కూటమిలోని తెలుగుదేశం, బీజేపీ నేతల మధ్య వివాదానికి కేంద్ర బిందువైంది. విశాఖ డెయిరీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ డెయిరీని అడారి ఆనంద్ తన కుటుంబ ఆస్తి లాగా భావించి, ఎన్నికలకు ముందు విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై శాసనసభలో కూడా విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభలో సమాధానం చెబుతూ.. ముఖ్యమంత్రితో మాట్లాడి విచారణకు ఆదేశిస్తామని చెప్పారు.
Also Read: బొత్సా కాళ్ళు నిజంగానే మంత్రి మొక్కారా..?
సభాసంఘాన్ని నియమించాలని స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్నపాత్రుడు మంత్రికి సూచించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో చర్చించి, టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో సభా సంఘాన్ని నియమించారు. సభ్యులందరూ ఇటీవల విశాఖ డెయిరీకి వెళ్లి పరిశీలించడంతో పాటు, డెయిరీ యాజమాన్యాన్ని నేరుగా విశాఖ కలెక్టరేట్కు పిలిపించి విచారణ జరిపారు. త్వరలోనే శాసనసభ కమిటీ హాల్లోనే సభా సంఘం సమావేశమై… అక్కడికి విశాఖ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్, అధికారులను పిలిపించి విచారించాలని నిర్ణయించారు. ఈ తరుణంలోనే అడారి ఆనంద్ తెలుగుదేశంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా.. ఆ పార్టీ తలుపులు మూసేసింది. ఆయన చేరికను టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకించారు.
Also Read : పవన్ తో భేటీ.. టాలీవుడ్లో టెన్షన్..!
దీంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో… అడారి ఆనంద్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి మంత్రాంగం జరిపారు. కమలం పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు. రాష్ట్ర పార్టీ నేతలకు ఢిల్లీ బీజేపీ పెద్దలు ఫోన్ చేసి, అడారి ఆనంద్ను బీజేపీలో చేర్చుకోవాలని ఆదేశించారు. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు.. వెంటనే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకి చేరవేశారు. ఆయన కూడా బీజేపీ నేతలకు అడారి ఆనంద్ చేరిక అంశంపై అప్రమత్తం చేశారు. అయినప్పటికీ బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి అతన్ని పార్టీలో చేర్చుకున్నారు. ఈ పరిణామం తెలుగుదేశం పార్టీలో కలకలానికి దారి తీసింది. విశాఖపట్నం టీడీపీ ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వెళ్లి అడారి ఆనంద్ను బీజేపీలో చేర్చుకోవడాన్ని ప్రస్తావించారు. మనం సమాచారం ఇచ్చినప్పటికీ అతన్ని పార్టీలో చేర్చుకోవడం ఏమిటో అర్థం కావడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ అంశంపై బీజేపీ నేతలతో మాట్లాడుదామని చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పారు.
Also Read : దీనెవ్వ తగ్గెదే లే.. తెలుగోడి సత్తా..!
ఈ లోపు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు చింతకాయల విజయ్లు విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి ఆనంద్పై ఫైర్ అయ్యారు. ఆయన రక్షణ కోసం బీజేపీలో చేరినప్పటికీ, చేసిన అవకతవకలపై విచారణ మాత్రం ఆగదని వ్యాఖ్యానించారు. అలాగే ఈ అంశంపై ప్రెస్ మీట్ పెట్టాలని విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు భావించారు. అయితే మిత్ర ధర్మం పాటించి, సంయమనంతో వ్యవహరించాలని, మూడు పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావిద్దామని పార్టీ అగ్రనేతలు విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలకు నచ్చ చెప్పారు. ఈలోపు విశాఖ డెయిరీలో అవకతవకలకు పాల్పడిన వ్యవహారంపై సభా సంఘం విచారణ కొనసాగించాలని కూడా నిర్ణయించారు. అయితే అడారి ఆనంద్ పై ఒక్క కేసు కూడా లేదని, అతన్ని పార్టీలో చేర్చుకోవడంలో తప్పేముందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పైగా తమ హైకమాండే ఆనంద్ను పార్టీలో చేర్చుకోవాలని సూచించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.




