ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం స్వల్పకాలిక ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో డిన్నర్ సమావేశంలో పాల్గొని అదే రోజు అమరావతికి తిరిగి వచ్చే అవకాశముంది. ఈ హడావుడి పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ముఖ్యంగా, ఈ భేటీ వెనుక అత్యవసరమైన రాజకీయ అంశాలపై చర్చ జరిగే అవకాశముందన్న ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.
Also Read : ఐఏఎస్ భార్య మృతి.. ఎన్నో అనుమానాలు..!
మరోవైపు, కేంద్ర బడ్జెట్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు అత్యంత కీలకమైన ఆర్థిక, అభివృద్ధి ప్రతిపాదనలను కేంద్రానికి నేరుగా వినిపించేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లుతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ రూపకల్పనలో అమిత్ షాకు ప్రత్యక్ష పాత్ర లేకపోయినా, కేంద్ర ప్రభుత్వంలో ఆయన కీలకమైన స్థానం, ప్రభావం దృష్ట్యా రాష్ట్ర అవసరాలను ఆయన ద్వారా ముందుకు తీసుకెళ్లాలన్న వ్యూహంలో ఈ సమావేశం భాగమని విశ్లేషిస్తున్నారు.
ఈ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చకు దారి తీసింది. ముఖ్యమంత్రి కేంద్ర నేతలతో జరిపే సమావేశాలు ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీయవచ్చన్న ఆందోళన కొందరు నేతల్లో కనిపిస్తోంది. ఏ అంశాలపై చర్చ జరుగుతుందన్నది అధికారికంగా వెల్లడికాకపోయినా, ఇలాంటి భేటీల తర్వాత రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
Also Read : హీరోయిన్ పై కడప రౌడీయిజం.. పూనమ్ కౌర్ని బెదిరించింది ఎవరు?
అయితే, ఇలాంటి సమావేశాల అనంతరం సాధారణంగా ప్రభుత్వపరంగా వెల్లడయ్యేది మాత్రం రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంశాలపై చర్చ జరిగిందన్న సమాచారం మాత్రమే. అంతర్గతంగా విస్తృత రాజకీయ చర్చలు జరిగినా, అవి బయటకు రాకుండా పరిమిత వివరాలకే ప్రకటనలు పరిమితం కావడం పరిపాటిగా మారింది.

