ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చంద్రబాబు సర్కార్ కఠినంగానే వ్యవహరించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో లబ్ది పొంది అధికారులు, ఈ ప్రభుత్వంలో కూడా వారికి సహకరిస్తున్న ఉద్యోగుల విషయంలో చంద్రబాబు కఠినంగానే వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు చాలా ఓపికగా దాదాపు 11 గంటల పాటు అధికారులు చెప్పేది వినటం లేదా వారికి దిశానిర్దేశం చేయడం చేసిన సంగతి తెలిసిందే. అధికారులు ఏం చెప్తున్నారో విన్న ఆయన కొందరు అధికారుల విషయంలో కఠినంగానే ఉంటాననే సంకేతాలు ఇచ్చారు. అది వీఆర్వో అయినా కలెక్టర్ అయినా ఒకటే అనే విధంగా సంకేతాలు ఇచ్చారు.
కొంత మంది కలెక్టర్ లను కూడా చంద్రబాబు నమ్మకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆల్ ఇండియా సర్వీసుల్లో ఉన్న కొందరు అధికారులను కేంద్రానికి తిరిగి పంపే ఆలోచనలో ఉన్నారట చంద్రబాబు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా ఆయన చర్చలు జరిపారని తెలుస్తుంది. రెవెన్యూ అధికారుల్లో చాలా మంది ఇంకా వైసీపీ నాయకులకి ఏకపక్షంగా సహకరిస్తున్నారనే విషయం ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలతో స్పష్టమవుతోంది. వారిలో ఎమ్మార్వోలు చాలా మందే ఉన్నారు. వారిని వీఆర్ఎస్ కు పంపించే యోచనలో చంద్రబాబు ఉన్నారట. ఈ విషయం తెలిసిన ఎమ్మార్వోలు వణికిపోతున్నారు. అవినీతి, అక్రమాలకు సహకరిస్తున్న అధికారులని సర్వీస్ నుంచి తొలగించాలన్న డిమాండ్ ఎక్కువగా ప్రజల నుంచి వినిపిస్తుంది.
Also Read : బాబు సంచలన నిర్ణయం.. వణికిపోతున్న పెద్దిరెడ్డి వర్గం
మదనపల్లి ఘటనలో దోషులుగా తేలిన అధికారులను వీఆర్ఎస్ కు పంపించేసే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం. ఇక పోలీసు అధికారులలో సిఐలు, డీఎస్పీలు కొందరి మీద ప్రభుత్వం విచారణ ముమ్మరం చేసింది. అవినీతి, అక్రమాలకు సహకరించే అందరిని ఆయన వీఆర్ఎస్ కు పంపడమో లేదా బదిలీ చేయడమో చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. కొందరు ఎస్పీలను కూడా చంద్రబాబు నమ్మకుండా కొందరు కింది స్థాయి అధికారులతో నివేదికలు సేకరించడం కూడా ఇప్పుడు పోలీసు శాఖలో హాట్ టాపిక్ అయింది. కొందరు ఐఏఎస్ అధికారులు త్వరలోనే తమ విధులకు రాజీనామా చేసి వెళ్ళిపోయే సూచనలు కనపడుతున్నాయి. ప్రవీణ్ ప్రకాష్ సహా కొందరు ఇప్పటికే రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే.




