ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని ఏపీలో కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది. ఇప్పటికే సామాజిక పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలెండర్ పథకం, మెగా డీఎస్సీ, అమరావతి రాజధాని హామీలను అమలు చేసిన చంద్రబాబు సర్కార్… ఇప్పుడు మరో హామీ అమలు దిశగా కార్యాచరణ ప్రారంభించింది. ప్రజాగళం యాత్ర సమయంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించాలని న్యాయశాఖకు సీఎం కార్యాలయం లేఖ రాసింది.
వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిపై అక్కసుతో మూడు రాజధానుల ప్రస్తావన తీసుకువచ్చింది. పరిపాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు నగరాలను ఎంపిక చేసింది. అందులో భాగంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ ప్రయత్నించింది. అయితే అప్పటికే అమరావతిలో హైకోర్టు కొనసాగుతుండటంతో పాటు శాశ్వత హైకోర్టు నిర్మాణానికి కూడా శంకుస్థాపన జరిగింది. పైగా హైకోర్టు మార్పు అంశం కేంద్ర న్యాయశాఖ పరిధిలో ఉంటుంది. అదే సమయంలో హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయవద్దని ఇతర ప్రాంతాల నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమైంది.
Also Read : బోరుగడ్డ దెబ్బకు జీవితం నాశనం చేసుకున్న మరో ఖాకీ
అటు కర్నూలులో కూడా బెంచ్ ఏర్పాటు చేస్తే చాలు… రాజధాని అమరావతిలోనే హైకోర్టు కొనసాగించాలని న్యాయవాదులు ధర్నాలు చేపట్టారు. దీంతో జగన్ తీసుకున్న నిర్ణయానికి ఆదిలోనే బ్రేక్ పడింది. హైకోర్టు బదులుగా బెంచ్ ఏర్పాటుకు ప్రజాగళం యాత్రలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేయాలని న్యాయశాఖకు లేఖ రాశారు. బెంచ్ ఏర్పాటుకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు న్యాయశాఖ కార్యదర్శి సునీత లేఖ రాశారు. రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలు కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి హైకోర్టులో దాఖలైన కేసుల వివరాలు ఇవ్వాలని న్యాయశాఖ కార్యదర్శి కోరారు.
బెంచ్ ఏర్పాటు చేయాలంటే ఈ నాలుగు జిల్లాల నుంచి 1/3 కేసులు ఉండాలని లేఖలో న్యాయశాఖ పేర్కొంది. రాష్ట్ర మొత్తం జనాభాలో 4.95 కోట్లు ఉండగా అందులో రాయలసీమలో రీజియన్ లో 1.59 కోట్లు మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. అంటే రాష్ట్ర మొత్తం జనాభాలో 25 శాతం మంది ఈ రీజియన్లో ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది. దేశంలో ఇప్పటికే 7 రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్లు ఏర్పాటు చేశారు అని అధికారులు గుర్తు చేశారు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటకలో బెంచ్లు కొనసాగుతుండగా.. ఉత్తరాఖండ్లో ఏర్పాటు కావాల్సి ఉంది. ఇక ఝార్ఖండ్లోని దుమ్కాలో బెంచ్ ఏర్పాటు ప్రతిపాదన ఉంది.
Also Read : సంక్రాతి నుంచి బాబు ‘మన్ కీ బాత్’
హైకోర్టులో రాయలసీమ రీజియన్ నుంచి వచ్చిన కేసుల్లో రెండు లేదా మూడు ఏళ్ల కంటే పెండింగ్లో ఉన్న వివరాలు కూడా ఇవ్వాలని అధికారులు కోరారు. దీనిపై సమగ్ర సమాచారం ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను న్యాయశాఖ కార్యదర్శి కోరారు. ఈ వివరాలు వచ్చిన వెంటనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ నుంచి ప్రతి చిన్న కేసుకు అమరావతికి రావాల్సిన అవసరం లేకుండా బెంచ్లోనే పరిష్కారం అవుతాయంటున్నారు.