వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా బస్ ప్రమాదాలతో వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు ప్రజలు. కర్నూలు, తాండూరు బస్ ప్రమాదం మరువక ముందే.. తాజాగా మరో ప్రమాదం చోటు చేసుకుంది. మక్కా యాత్ర కోసం వెళ్ళిన భక్తులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు. మదీనా సమీపంలో ఉమ్రాకు యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ను ఢీకొట్టడంతో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో చాలా మంది భారతీయులు అని సౌదీ అరేబియాలోని స్థానిక మీడియా తెలిపింది.
Also Read : పరకామణి కేసులో కూడా జరుగుతాయా..?
బస్సు మక్కా నుండి మదీనాకు వెళుతుండగా ముఫ్రిహాత్ సమీపంలో భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1.30 గంటలకు ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు హైదరాబాద్కు చెందినవారని ఖలీజ్ టైమ్స్ వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో ఈ బృందం మక్కా నుండి తమ మత ఆచారాలను పూర్తి చేసుకుని మదీనాకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గల్ఫ్ న్యూస్ నివేదిక ప్రకారం, ఆ సమయంలో చాలా మంది ప్రయాణికులు నిద్రలో ఉన్నారని, బస్సు ఢీకొన్న తర్వాత మంటలు చెలరేగడంతో వారు తప్పించుకునే అవకాశం లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తున్నారు.
Also Read: లిక్కర్ డాన్ అనీల్ చోక్రా.. ఏపీ లిక్కర్ స్కామ్ లో అతనే మాస్టర్ మైండ్..?
బాధితుల్లో కనీసం 11 మంది మహిళలు, 10 మంది పిల్లలు ఉన్నారని అక్కడి మీడియా తెలిపింది. ఆల్ మక్కా ట్రావెల్స్ నుంచి 20 మంది, ఫ్లై జోన్ ట్రావెల్స్ నుంచి 24 మంది ప్రయాణికులు మక్కా వెళ్లినట్టు గుర్తించారు. యాత్రికులు హైదరాబాద్ అసిఫ్నగర్, జిర్రా, హబీబ్నగర్కు చెందినవారుగా గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి.. అక్కడి భారత ఎంబసీ అధికారులతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ లను కూడా అక్కడి ఎంబసీ ప్రకటించింది. గత నెలలో కర్నూలులో జరిగిన ప్రమాదం కూడా ఇదే తరహాలో జరిగిన సంగతి తెలిసిందే.

