ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఎన్డీఏలో ఎవరికి అవకాశం దక్కుతుంది అనేదానిపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చలు జరుగుతున్నాయి. మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సమయంలో.. జనసేనకు ఒక సీటు కూడా ఇవ్వలేదు. ఆ సమయంలో బిజెపి మరోసారి ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపించింది. దీనితో ఈసారి జనసేనకు సీటు ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరిగింది.
Also Read : జూన్ 12న ఏపీలో సంచలన అడుగు
కానీ రాజ్యసభ స్థానానికి మరోసారి బిజెపి ఆసక్తి చూపిస్తోంది. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా జాతీయ స్థాయిలో అభ్యర్థిని ఎంపిక చేయాలని బిజెపి పట్టుబడుతున్నట్లు సమాచారం. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ రేసులో ముందున్నారు. 2024 ఎన్నికల్లో ఆమె రాహుల్ గాంధీ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉందని భావించారు. పలు కారణాలతో అక్కడి నుంచి ఆమెకు అవకాశం దక్కలేదు. ఇక ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి ఆమెను రాజ్యసభకు పంపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read : టార్గెట్ రోజా… పెద్దాయన మాస్ ర్యాగింగ్..!
ఇక ఆమెతో పాటుగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై.. కూడా రేసులో ఉన్నారు. దక్షిణాదిన సమర్థవంతమైన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది.. 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన సమర్థతను గుర్తించిన బిజెపి అధిష్టానం రాజ్యసభలో కూర్చోబెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో వీరిద్దరిలో ఎవరో ఒకరిని రాజ్యసభకు పంపించే అవకాశం ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ టిడిపి నుంచి అభ్యర్థిని ఎంపిక చేస్తే మాత్రం ఖచ్చితంగా గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పేరు ముందు వరుసలో ఉంది.