టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో ఇప్పుడు ప్రభుత్వం కీలక అడుగులు వేయనుంది. ఇటీవల ఆయనకు కేటాయించిన ఒక హెలికాప్టర్ పూణే సమీపంలో కూలిపోవడం పట్ల ఆందోళన వ్యక్తమైంది. ఆ హెలికాప్టర్ ఎటువంటి ప్రతికూల వాతావరణం లేకుండానే కూలిపోవడం పట్ల తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. దీని వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా అనే దానిపై అధికారులు అంతర్గత విచారణ కూడా చేస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు భద్రత విషయంలో కీలక మార్పులు చేసేందుకు సిద్దమవుతున్నారు.
చంద్రబాబు వద్ద గతంలో పని చేసిన కొందరు సీనియర్ అధికారులు ఆయన భద్రత విషయంలో కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఒక మాజీ డీజీపీ కూడా ఈ భద్రత అంశంలో ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు. హెలికాప్టర్ ప్రయాణాలను పూర్తిగా తగ్గించే విధంగా ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేస్తోంది. ఎక్కడికి వెళ్ళినా ముందు సమీపం లోని విమానాశ్రయాల వరకు విమానాల్లో వెళ్లాలని, ఆ తర్వాత హెలికాప్టర్ ను అత్యవసరం అయితే మాత్రమే వినియోగించాలని భావిస్తున్నారు. ఇక కొత్త హెలికాప్టర్ ను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సిద్దమవుతోందని తెలుస్తుంది. దీనికి సంబంధించి కేబినేట్ లో నిర్ణయం తీసుకోనున్నారు.
అలాగే కాన్వాయ్ లో వాహనాలపై కూడా ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకోనుంది. భద్రత కోసం అత్యాధునిక వసతులు ఉన్న ఒక వాహనాన్ని కొనాలని భావిస్తున్నారు. హెలికాప్టర్ ప్రయాణం లేని ప్రాంతాల్లో ఆ వాహనాన్ని వినియోగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అటు కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబు అమరావతిలోనే ఉండి పరిపాలన చేయాలని, అవసరమైతే మినహా ప్రయాణాలు చేయవద్దని సూచిస్తున్నారు. ఆయన భద్రతా పై వారు కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఏవియేషన్, ప్రోటోకాల్ బాధ్యతలను కల్నల్ స్థాయి అధికారికి మళ్ళీ అప్పగించాలని కోరుతున్నారు. దీనిపై త్వరలోనే సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.