ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబుకు గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే ఇంట్లో అన్నదమ్ముల పోరుతో సతమతమవుతున్న మోహన్ బాబుకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. దాదాపు నెల రోజుల పాటు విష్ణు, మనోజ్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ వివాదం చివరికి పోలీస్ స్టేషన్ వరకు చేరుకుంది. అన్నదమ్ముల గొడవ రావడంతో.. మోహన్ బాబు స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ వివాదం చివరికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మోహన్ బాబు యూనివర్సిటీ వరకు చేరింది. తనను యూనివర్సిటీలోకి రానివ్వకుండా సోదరుడు విష్ణు అడ్డుకుంటున్నాడని మనోజ్ ధర్నా చేపట్టారు కూడా. యూనివర్సిటీ గేటు ముందు ఆందోళన కూడా చేశారు.
Also Read : నందమూరి బాలకృష్ణ వారసురాలిగా…!
తాజాగా అదే యూనివర్సిటీ చుట్టూ మరోసారి వివాదాలు చెలరేగాయి. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేశారని.. అలాగే ఆదాయాన్ని వెల్లడించలేదని.. విద్యార్థుల హాజరులో అవకతవకలు జరిగాయనేది మోహన్ బాబు యూనివర్సిటీపైన ప్రధాన ఆరోపణలు. అదే సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్లు విద్యార్థులకు ఇవ్వకుండా నిలిపివేస్తున్నారనే ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్.. మోహన్బాబు యూనివర్సిటీకి ఏకంగా రూ.15 లక్షలు జరిమానా విధించింది. ఈ సొమ్మును వర్సిటీ అధికారులు ఇప్పటికే చెల్లించేశారు. అయితే కమిషన్ తనిఖీలో మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది.
ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి ఏకంగా 26 కోట్ల 17 లక్షల 52 వేలు వసూలు చేసినట్లు కమిషన్ విచారణలో గుర్తించారు. దీనిపై ఆరా తీయగా.. మూడేళ్ల నుంచి ఫీజు రీయింబర్స్ వర్తించే విద్యార్థుల నుంచి కూడా ఫీజులు వసూలు చేసినట్లు కమిషన్ అధికారులు గుర్తించారు. పేరెంట్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో విచారణ జరిపించిన ఉన్నత విద్యాశాఖ అధికారులు.. యూనివర్సిటీ గుర్తింపుని రద్దు చేయాలని ఉన్నత విద్యా కమిషన్ ఏపీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. విద్యార్థుల నుంచి వసూలు చేసిన 26 కోట్ల రూపాయలను కూడా 15 రోజుల్లో చెల్లించాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీ గుర్తింపును ఉపసంహరించుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వానికి, యూజీసీ, ఏఐసీటీఈ, పీసీఐ, ఐసీఆర్, హెల్త్ కేర్ ప్రొషెషన్స్ కౌన్సిల్కు సిఫార్సు కూడా చేసింది.
Also Read : తెలంగాణలో దున్నపోతు దుమారం..!
మోహన్ బాబు యూనివర్సిటీలో అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారని పేరెంట్స్ అసోసియేషన్ నేరుగా ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్కు ఫిర్యాదు చేసింది. బిల్డింగ్ ఫీజు, ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజులతో పాటు హాస్టల్లో ఉండని వారి నుంచి కూడా మెస్ ఫీజు వసూలు చేస్తున్నట్లు తమ ఫిర్యాదులో స్పష్టం చేశారు. పేరెంట్స్ అసోసియేషన్ ఫిర్యాదుపై ముగ్గురు సభ్యుల కమిషన్ విచారణ జరిపింది. కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఉన్నత న్యాయస్థానం గత నెల 26న మూడు వారాలపాటు తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.