నిన్నటి వరకు ఒకలెక్క… ఇప్పుడు ఒక లెక్క… అన్నట్లుగా మారింది టీడీపీ నేతల పరిస్థితి. తాజాగా పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు… కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు రానంత వరకు పైరవీలు చేశారు… నానా పాట్లు పడ్డారు… ఎన్నోసార్లు బ్రతిమిలాడిన నేతలు… పదవి వచ్చిన తర్వాత మాత్రం ముఖం చాటేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే పదవులిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. అయితే కొందరు నేతలు మాత్రం అసలేమాత్రం పని చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారాయి.
Also Read : ఎన్నాళ్లీ జాప్యం… ఎందుకీ ఆలస్యం…?
అయితే చంద్రబాబు వ్యాఖ్యలను కొందరు నేతలు తప్పుబడుతున్నారు. తామంతా ఎంతో కష్టపడి పని చేశామని.. అందుకే పదవులిచ్చారని అంటున్నారు. అదే సమయంలో తమకు పదవులైతే ఇచ్చారు కానీ… పని చేసేందుకు సరైన మౌలిక వసతులు ఎక్కడున్నాయో చెప్పాలని కూడా ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వంలో అడిగిన వారికి, అడగని వారికి కూడా జగన్ పదవులిచ్చారు. అలాగే కొత్తగా 56 కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. పదవులైతే ఇచ్చారు కానీ… వాటికి కావాల్సిన కార్యాలయాలు, సిబ్బంది, కనీస వసతులు కూడా కల్పించలేదు. దీంతో చాలా మంది నేతలు పదవి బోర్డుతోనే సరిపెట్టుకున్నారు. కులాల కార్పొరేషన్ల కార్యాలయాలు అయితే… కొన్ని చోట్ల నాలుగు కార్పొరేషన్లనకు ఒకటే ఆఫీసు ఇచ్చారు. వాటిల్లో కూడా కనీసం కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవు. దీంతో ఆయా ఛైర్మన్లు, డైరెక్టర్లు అంతా కూడా కేవలం పదవులకే పరిమితం అయ్యారు.
Also Read : వై నాట్ పులివెందుల… వర్కవుట్ అవుతుందా…?
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రెండు విడతలుగా కార్పొరేషన్ పదవుల జాబితాను విడుదల చేసింది. వీటిల్లో కొన్ని శాఖలకు చెందిన ఛైర్మన్లకు అయితే ఇప్పటి వరకు వారికి సంబంధించిన కార్యాలయాలు ఎక్కడున్నాయో కూడా తెలియటం లేదు. ఇటీవల ఛైర్మన్ పదవి దక్కించుకున్న ఓ మహిళా నేత… విజయవాడ సింగ్ నగర్లోని తన కార్యాలయానికి వెళ్లి చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారట. నిన్నటి వరకు సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేసిన సదరు మహిళ… సింగ్ నగర్లో లిఫ్ట్ కూడా లేని ఓ పాతభవనం మూడో అంతస్తులో తన కార్యాలయం ఉండటం చూసి సైలెంట్ అయ్యారట. సీనియర్లను కాదని తనకు పదవి ఇచ్చినందుకు సంతోషించాలో… అసలు కనీసం కూర్చునేందుకు సరైన కుర్చీలు కూడా లేని కార్యాలయం ఇచ్చినందుకు బాధపడాలో అర్థం కావటం లేదని సన్నిహితుల దగ్గర వాపోయారు కూడా. చివరికి తనకు పదవి రావడానికి కారణమైన నారా లోకేష్ను స్వయంగా కలిసి… తన కార్యాలయాన్ని మరోచోటికి మార్చాలని వేడుకున్నారట. దీంతో లోకేష్ ఇలాంటి కార్యాలయాలు ఎన్ని ఉన్నాయో పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. కార్యాలయం మార్చాలంటూ ఆ మహిళ నేత ధైర్యంగా ముందుకు రావడంతో… మిగిలిన నేతలు కూడా ఇప్పుడు ఒక్కొక్కరుగా సీఎం చంద్రబాబును నేరుగా కలిసి… తమ కార్యాలయంలో వాస్తవ పరిస్థితులను స్వయంగా వివరిస్తున్నట్లు తెలుస్తోంది.