ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనుల విషయంలో మరోసారి చర్చలు మొదలయ్యాయి. 2019 నుంచి 2024 వరకు అమరావతి పనులు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం మారిన తర్వాత అమరావతి పనులు వేగం పుంజుకుంటాయని అందరూ ఎదురు చూశారు. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్రం కూడా భారీగా నిధులు కేటాయించడంతో పనులు మొదలయ్యే సంకేతాలు కనిపించాయి. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి పనులను తిరిగి ప్రారంభించారు. ఏ మేరకు భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం.
Also Read : పాక్ దారుణాలపై.. ఐరాసాలో పర్వతనేని హరీష్ సంచలన కామెంట్స్..!
కానీ పనుల విషయంలో మాత్రం పురోగతి కనపడటం లేదు అనే విమర్శలు వినపడుతున్నాయి. 2019 నుంచి 2024 వరకు రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున మొక్కలు మొలవడం, అడవిలా మారిపోవడం వంటివి జరిగాయి. ఇప్పుడు మళ్లీ అవే పరిస్థితులు క్రమంగా కనబడుతున్నట్లు విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసి, అనుమతులు కూడా మంజూరు చేసింది. నిర్మాణాలు మొదలు పెట్టుకునేందుకు అనువుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానీ పనులు మాత్రం అనుకున్న విధంగా ముందుకు వెళ్లడం లేదని ఆరోపణలు వినపడుతున్నాయి.
అయితే గత కొంతకాలంగా వర్షాలు విస్తారంగా పడటంతో అమరావతి ప్రాంతంలో తీసిన గోతులలో నీళ్ళు నిలబడ్డాయి. ఇక ఇప్పుడు క్రమంగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నిర్మాణాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళతాయి అనే అభిప్రాయాలు సైతం వినపడుతున్నాయి. ఇప్పటికే ఏడాదికి పైగా సమయం వృధా కావడంతో, అమరావతి విషయంలో విపక్షాలు విమర్శలు చేసేందుకు అవకాశం దొరుకుతుంది అంటున్నారు టిడిపి కార్యకర్తలు. ఇప్పటికే వైసీపీ కార్యకర్తలతో పాటుగా, కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా అమరావతి విషయంలో విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది.
Also Read : ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్..!
ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించినంత దూకుడు క్షేత్రస్థాయిలో అధికారుల నుంచి గాని, భూ కేటాయింపులు చేయించుకున్న కంపెనీల నుంచి గాని కనపడటం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్, సహా కొన్ని భవనాలు మాత్రమే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఇక మిగిలిన ప్రాంతంలో మొక్కలు భారీగా మొలవడంతో, మరోసారి వాటిని తొలగించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయేది శీతాకాలం కావడం, ఆ తర్వాత వర్షాకాలం ఉండటంతో ఈ రాబోయే ఎనిమిది నెలల కాలంలో వేగంగా పనులు చేయాలని కార్యకర్తలు, అమరావతి రైతులు కోరుతున్నారు. ఇక రెండవ దశ భూ సేకరణ విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గితే మంచిది అనే అభిప్రాయాలు సైతం వినపడుతున్నాయి.