సంధ్య థియేటర్ ఘటనలో ఎవరి తప్పూలేదన్నాడు సినీ హీరో అల్లు అర్జున్. అనుకోకుండా జరిగిన సంఘటన అని క్లారిటీ ఇచ్చాడు. శనివారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ వివరణ ఇచ్చాడు. న్యాయవాది అశోక్ రెడ్డి, తన తండ్రి అల్లు అరవింద్ కలిసి మీడియా ముందుకు వచ్చాడు. ఈ ఘటనలో గాయపడిన చిన్నారి శ్రీతేజ్ కోలుకోవాలని కోరుకుంటున్నా అన్నాడు అల్లు అర్జున్. నేను ఎవరినీ తప్పుపట్టడం లేదన్న బన్నీ… నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు.
Also Read : నేను సీఎం గా ఉండగా మీ ఆటలు సాగవు.. టాలీవుడ్ కు రేవంత్ స్ట్రోక్
15 రోజులుగా ఇంట్లోనే కూర్చొని బాధపడుతున్నాను అన్నాడు. ప్రభుత్వంతో నేను ఎలాంటి వివాదం కోరుకోవడం లేదని నా వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూస్తున్నారని అసహనం వ్యక్తం చేసాడు. సీఎం రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నాడు. అనుమతి లేకుండా వెళ్లామనేది తప్పుడు ఆరోపణ, రోడ్ షో చేశామని చెప్పడం సరికాదన్నాడు. అనుమతి లేకుంటే నేను అక్కడికి వెళ్లేవాడిని కాదని తెలిపాడు. వేల మంది నన్ను చూడటానికి వచ్చారన్న బన్నీ… వారికి ధన్యవాదాలు చెప్పడానికి బయటికి వచ్చాను అన్నాడు.
Also Read : వర్మపై ఏపీ సర్కార్ రివేంజ్…?
అలా రాకపోతే పొగరు అనుకుంటారని బయటకు వచ్చినట్టు తెలిపాడు. తొక్కిసలాట గురించి మరుసటి రోజు తెలిసిందని.. తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నానని అనడం సరికాదన్నాడు. క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పగానే వెళ్లిపోయానని… అసలు తన వద్దకు ఏ పోలీస్ రాలేదన్నాడు. ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రికి వెళ్దామనుకున్నాని… పోలీసులు నన్ను వెళ్లొద్దని చెప్పారన్నాడు. చిరంజీవి, పవన్ అభిమానులను పరామర్శించడానికి.. నేను ఎంతో దూరం వెళ్లానని నా అభిమానులకు ఇబ్బంది కలిగితే వెళ్లనా అని ప్రశ్నించాడు. సినిమా హిట్ అయ్యాక విజయోత్సవం జరుపుదామనుకున్నామని ఈ ఘటన తర్వాత రద్దు చేసుకున్నామన్నాడు. వ్యక్తిత్వ హననాన్ని భరించలేకపోతున్నా అని ఆవేదన వ్యక్తం చేసాడు.




