స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలు కాబోతున్న తరుణంలో నేడు.. టీడీపీ ఆఫీస్ లో సీఎం చంద్రబాబు.. నిర్వహించబోతున్న సమావేశం ఆసక్తిని రేపుతోంది. సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. దాదాపు 6 గంటల పాటు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే గడపనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హోదాలో చంద్రబాబు ఇంత సుదీర్ఘ సమయాన్ని పార్టీ ఆఫీస్కు కేటాయించడం ఇదే మొదటిసారి.
Also Read : పోలీసులను టార్గెట్ చేసిన ట్రైనీ ఐపీఎస్..? తలనొప్పిగా విచారణ..!
పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో చంద్రబాబు జరపబోయే ఈ ముఖాముఖి భేటీ వెనుక అత్యంత వ్యూహాత్మకమైన రాజకీయ కారణాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. అసలు ఏంటి ఈ భేటీ.. బాబు మైండ్లో ఉన్న ప్లాన్ ఏంటి..? అనే కోణంలో పరిశీలిస్తే ప్రధానంగా నామినేటెడ్ పదవుల భర్తీపైనే ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన క్యాడర్లో అసంతృప్తి రాకుండా, ద్వితీయ శ్రేణి నాయకులకు నామినేటెడ్ పదవులను ఎలా కేటాయించాలనే దానిపై బాబు ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వనున్నారు.
Also Read : కవితను లైట్ తీసుకున్న బీఆర్ఎస్..!
దీనితో పాటు, కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ‘సూపర్ సిక్స్’ హామీల అమలు తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నేతలు ఎక్కడైనా వెనకబడ్డారా? అనే అంశంపై నియోజకవర్గాల వారీగా చంద్రబాబు రివ్యూ చేయబోతున్నారు. మరోవైపు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడం కూడా ఈ భేటీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు చేతికి నియోజకవర్గాల వారీగా నేతల పనితీరుపై రహస్య సర్వే రిపోర్టులు అందినట్లు సమాచారం. ఈ నివేదికల ఆధారంగా సరిగ్గా పనిచేయని నేతలకు బాబు క్లాస్ పీకడమే కాకుండా, రాబోయే రోజుల్లో పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయాన్ని ఎలా పెంచాలనే దానిపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ 6 గంటల సుదీర్ఘ సమావేశం ముగిసిన తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికరంగా మారింది.

