గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి వ్యవహారం తాజాగా ఆసక్తిని రేపుతోంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కస్టడీ ముగిసిన అనంతరం ఉప్పర్పల్లి కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి, సైబరాబాద్ సీపీ సజ్జనార్తో పాటు అత్తాపూర్ పోలీసులపై సంచలన ఆరోపణలు చేస్తూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి తనను విచారించేందుకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు వచ్చిన సీపీ సజ్జనార్, అత్యంత అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారని, తన కుటుంబ సభ్యులను ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించారని ఉదయ్ కృష్ణారెడ్డి మేజిస్ట్రేట్ ముందు బోరున విలపించారు.
Also Read : జనసేన జెండా కోసం పవన్ మాస్టర్ ప్లాన్..!
ఈ క్రమంలో కోర్టు రూమ్ నుండి ఇతరులందరినీ జడ్జి బయటకు పంపించి ఉదయ్ కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేయడం తీవ్ర ఉత్కంఠ రేపింది. కస్టడీ సమయంలో పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, తనపై అనుచితంగా ప్రవర్తిస్తూ బూతులు తిట్టారని ఉదయ్ కృష్ణారెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిసిటివి కెమెరాలు లేని చోట తనను విచారించారని, టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు తీసుకెళ్లి తీవ్రంగా టార్చర్ చేస్తూ కొట్టారని మేజిస్ట్రేట్కు వివరించారు. అంతటితో ఆగకుండా, రాష్ట్రంలో ఉన్న 13 మంది తెలుగు ట్రైనీ ఐపీఎస్ల జీవితాలను కూడా నాశనం చేస్తామని పోలీసులు బెదిరించినట్లు ఆరోపించారు.
Also Read : కవితను లైట్ తీసుకున్న బీఆర్ఎస్..!
విచారణలో పాల్గొన్న ప్రతి పోలీసు అధికారిపై మరియు సీపీ సజ్జనార్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ నోటీసులు జారీ చేయాలని ఉదయ్ కృష్ణారెడ్డి మేజిస్ట్రేట్ను కోరారు. ఉదయ్ కృష్ణారెడ్డి తరఫు న్యాయవాదులు కూడా ఈ విచారణ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు సర్వీసులో లేని రిటైర్డ్ ఏసీపీ పూర్ణచందర్ రావు ఈ విచారణలో ఎలా పాల్గొంటారని వారు ప్రశ్నించారు. విచారణ సమయంలో అడ్వకేట్లను కూడా చంపేస్తామని పోలీసులు బెదిరించినట్లు కోర్టుకు తెలిపారు. ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ఉప్పర్పల్లి కోర్టు అత్తాపూర్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. సిసిటివి కెమెరాలు లేని చోట ఉదయ్ కృష్ణారెడ్డిని ఎలా విచారణ చేశారని ప్రశ్నిస్తూ.. అత్తాపూర్ ఇన్స్పెక్టర్కు షోకాజ్ నోటీసు ఇచ్చింది. దీనిపై రెండు రోజుల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలని మేజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించడంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.

