మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు తగ్గట్టు క్రికెట్లో కూడా సమూల మార్పులకు ఐసీసీ శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీల్లో మహిళా క్రికెటర్లకు పురుషులతో సమానంగా నగదు బహుమతిని అమలు చేస్తున్న ఐసీసీ.. ఈసారి బంతిపై దృష్టి సారించనుంది. ప్రస్తుతం టెస్టులకే పరిమితమైన పింక్ బాల్ను ఇక నుంచి వన్డే, టీ20ల్లోనూ ప్రవేశపెట్టేందుకు అత్యున్నత క్రికెట్ మండలి పావులు కదుపుతోంది. అన్నీ కుదిరితే అహ్మదాబాద్లో జరగనున్న ఐసీసీ సమావేశంలో నిర్ణయం వెలువడే అవకాశముంది. పొట్టి క్రికెట్కు రోజురోజుకు ఆదరణ పెరుగుతున్న ఈ రోజుల్లో టెస్టులు, వన్డేలను మరింత ఆసక్తిగా మార్చేందుకు ఐసీసీ ప్రయత్నిస్తోంది.
Also Read : వంగ మాస్టర్ ప్లాన్.. కాస్టింగ్ తోనే బాక్సాఫీస్ షేక్..!
ఇదివరకే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్తో సుదీర్ఘ ఫార్మాట్కు జీవం పోసిన ఐసీసీ.. ఈసారి డ్రింక్స్ బ్రేకులో కూడా హెడ్ కోచ్ను అనుమతించాలనే ఉద్దేశంతో ఉంది. అలానే వన్డే, టీ20ల్లో కూడా గులాబీ బంతికి ఓకే చెప్పడం, పొట్టి క్రికెట్లో ఇన్నింగ్స్ విరామం సమయాన్ని కుదించడం, ఆన్ ఫీల్డ్ అంపైర్లకు హ్యాక్ ఐ డేటాను పరిశీలించే అవకాశమివ్వడం వంటి వాటిపై ఐసీసీ దృష్టి సారిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా మే 30న జై షా నేతృత్వంలోని ఐసీసీ ప్రతినిధుల సమావేశంలో వీటిపై తీర్మానాలు చేసి.. ఆమోదముద్ర వేసే అవకాశముంది.
టెస్టు క్రికెట్ ఆరంభం నుంచి ఎర్ర బంతినే ఉపయోగించేవారు. కానీ, ఈ మధ్య గులాబీ బంతిని టెస్టు మ్యాచుల్లో చూస్తున్నాం. ఐదు లేదా మూడు మ్యాచ్ల సిరీస్లో ప్రత్యేక ఆకర్షణగా డే నైట్లో పింక్ బాల్ టెస్టు ఆడిస్తున్నారు. వన్డేలు, టీ20ల్లో ఎప్పటి నుంచో తెల్ల బంతినే వాడుతున్నారు. ఇకపై పరిస్థితులను బట్టి వన్డే, టీ20ల్లో కూడా పింక్ బాల్ మ్యాచ్లకు ఐసీసీ అనుమతించనుంది. ఇరుజట్లు అంగీకరిస్తే డే నైట్ మ్యాచుల్లో గులాబీ బంతిని వాడేందుకు అనుకూలంగా నిబంధనలను మార్చనుంది.
Also Read : దుమారం రేపుతున్న సీజేఐ వ్యాఖ్యలు.. ఎందుకిలా..!
టీ20ల్లో ఇన్నింగ్స్ బ్రేకు కుదించడంపై ఐసీసీ సభ్యులు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం తొలుత ఆడిన జట్టు ఇన్నింగ్స్ ముగిశాక 20 నిమిషాలకు రెండో జట్టు ఇన్నింగ్స్ మొదలవుతుంది. ఈ సమయాన్ని 15 నిమిషాలకు మార్చాలని ఐసీసీ భావిస్తోంది. ఇన్నింగ్స్ ముగిశాక ఆటగాళ్లు కలిసి.. చర్చించుకునేందుకు ఐదు నిమిషాలు పడుతుంది. మరో పది నిమిషాల తర్వాత వారు మైదానంలోకి దిగేలా నిబంధనలు మార్చాలని ఐసీసీ ప్రతినిధులు అనుకుంటున్నారు.
ప్రస్తుతం టీ20ల్లో మాత్రమే డ్రింక్స్ బ్రేకులో హెడ్ కోచ్ను మైదానంలోకి అనుమతిస్తున్నారు. వన్డేలు, టెస్టుల్లో మాత్రం స్క్వాడ్లోని ఆటగాళ్లకు మాత్రమే డ్రింక్స్ను గ్రౌండ్లోకి తీసుకువస్తుంటారు. కానీ, ఇకపై ఈ రెండు ఫార్మాట్లలో కూడా ఇన్నింగ్స్ మధ్యలో కోచ్లను మైదానంలోకి అనుమతివ్వాలని ఐసీసీ భావిస్తోంది. అయితే.. డ్రింక్స్ తెచ్చే ఆటగాళ్లు క్రికెట్ జెర్సీ వేసుకోవాలి. ఇప్పుడు కోచ్లకు కూడా అదే నియమం వర్తిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. అలానే.. ఆన్ ఫీల్డ్ అంపైర్లకు హ్యాక్ ఐ డేటాను పరిశీలించే అవకాశమివ్వాలని ఐసీసీ అనుకుంటోంది. తద్వారా మైదానంలో బౌలర్లు ఎలాంటి అనైతికమైన పనులకు పాల్పడకుండా చూడాలని భావిస్తోంది.

