పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట వైసీపీలో.. అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. పార్టీ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ వివాదాలు, నేతల మధ్య సమన్వయ లోపం బహిర్గతమవ్వడం ఇప్పుడు నియోజకవర్గవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సర్పంచ్ ల సన్మాన కార్యక్రమం, పార్టీలోని గ్రూపు రాజకీయాలకు వేదికగా మారింది. లింగంగుంట్లలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Also Read : యుద్ధం.. అప్రకటిత లాక్ డౌన్..!
ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని కీలక నేతలందరూ హాజరయ్యారు. అయితే, వేదికపైకి ముఖ్య నేతలను ఆహ్వానిస్తున్న సమయంలో నరసరావుపేట మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వాసుదేవరెడ్డి పేరును నిర్వాహకులు ప్రస్తావించలేదు. పార్టీలో సీనియర్ నేతగా, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గా ఉన్న తనను కనీసం వేదికపైకి పిలవకపోవడంపై వాసుదేవరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అవమాన భారంతో ఆయన కార్యక్రమం జరుగుతుండగానే సభ నుండి మధ్యలోనే లేచి వెళ్లిపోయారు.
Also Read : ఈసారి మాకు రెండు టికెట్లు ఇవ్వాలి.. లేదంటే..!
మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అందరినీ కలుపుకొని పోవాల్సిన నాయకత్వం, కీలక నేతలను విస్మరించడంపై వాసుదేవరెడ్డి అనుచరులు మండిపడుతున్నారు. నియోజకవర్గంలో మొదటి నుండి పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెడుతున్నారనే ఆరోపణలు ఈ ఘటనతో మరింత బలపడ్డాయి. సర్పంచ్ లను గౌరవించే క్రమంలో మరో కీలక నేతను అవమానించడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ కేడర్ను ఉత్సాహపరచడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుంటే, నేతల మధ్య ఉన్న ఈ ఈగోలు కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే పల్నాడు రాజకీయాల్లో వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో, సొంత పార్టీ నేతల మధ్యే సఖ్యత లేకపోవడం ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతోంది. ఈ వ్యవహారంపై అధిష్టానం దృష్టి సారించకపోతే, రాబోయే రోజుల్లో నరసరావుపేట వైసీపీలో మరిన్ని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

