అధికారం కోల్పోయిన తర్వాత కూడా పోలీసులను పదే పదే బెదిరిస్తోన్న వైసీపీ నేతలకు.. పోలీసులు షాక్ ఇస్తున్నారు. తాజాగా మరో వైసీపీ కీలక నేతపై కేసు నమోదు చేసారు పోలీసులు. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు అయింది. మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. విధుల్లో ఉన్న పోలీసు అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు, వారిని బెదిరించారనే ఆరోపణలపై పోలీసు అధికారుల సంఘం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.
Also Read : నంద్యాల టూ సికింద్రాబాద్.. నయా రైల్..!
మచిలీపట్నంలో ఒక అక్రమ కట్టడం కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. మున్సిపల్ అధికారులు పోలీసుల రక్షణతో కూల్చివేత చేపట్టగా, పేర్ని నాని అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. ఈ క్రమంలో చిలకలపూడి సీఐ పరమేశ్వరరావుతో పేర్ని నానికి తీవ్ర వాగ్వాదం జరిగింది. చట్టం ప్రకారం పని చేయండి.. ఎవరో చెప్పారని ఓవర్ యాక్షన్ చేస్తే ఊరుకోం అంటూ పోలీసులపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు పోలీసుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పోలీస్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read : బాబు మాస్టర్ స్ట్రోక్.. అమరావతికి ‘చట్ట రక్షణ’
ఈ ఘటనపై సీరియస్ అయిన పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు ఈరోజు ఉదయం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. రాజకీయ నాయకులు విధుల్లో ఉన్న అధికారులను కించపరచడం, బెదిరించడం సరికాదని వారు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన చిలకలపూడి పోలీసులు, పేర్ని నానిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, ఈ కేసు నమోదుపై పేర్ని నాని వర్గీయులు స్పందిస్తూ.. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిడితోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించడంతో.. బందరులో రాజకీయం వేడెక్కింది.

