గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన.. పరకామణి కేసుకు సంబంధించి తాజాగా చోటుచేసుకున్న పరిణామం అత్యంత సంచలనమైంది. ఈ కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న అధికారి సతీష్ కుమార్ నిన్న అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం విమర్శలకు దారితీస్తోంది. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. నిన్న అతని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండా.. స్కానింగ్ నిర్వహించారు పోలీసులు. హత్యకు గల కారణాలు ఏంటి, అసలు అది హత్య లేదా ఆత్మహత్య అనేదానిపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టి.. చివరకు హత్య అని తేల్చారు.
Also Read : పెట్టుబడుల్లో ఏపీ దూకుడు.. రికార్డ్ స్థాయిలో ఒప్పందాలు..!
దీనిపై సీఐడీ విభాగం డీజీ రవిశంకర్ అయ్యన్నార్ స్వయంగా రంగంలోకి దిగారు. నేడు అనంతపురంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో పోలీసు ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. సతీష్ కుమార్ మృతి పై దర్యాప్తు చేయాల్సిన కోణాలపై అధికారులకు వివరించారు రవిశంకర్. అదేవిధంగా దర్యాప్తుల భాగంగా గతంలో కీలక హత్య కేసులు, సైబర్ నేరాలకు సంబంధించిన కేసులను పోలీసులు ఆరా తీస్తున్నారు. సతీష్ కుమార్ హత్యకు సంబంధించి మొత్తం 15 బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. అతని మొబైల్ ఫోన్ కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ ఇచ్చి హత్య చేసి ఉండవచ్చు అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read : పరిటాల నుంచి పరకామణి వరకు.. కీలక నిందితులు మరణాలు..!
తాజాగా సతీష్ కుమార్ మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన వైద్యులను పిలిచారు రవిశంకర్. న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్ విభాగాల స్పెషలిస్టులతో సిఐడి డీజీ సమావేశం నిర్వహించారు. రేడియాలజిస్టుల నుంచి ఇప్పటికే సమాచారం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక హత్యకు ముందు రోజు రాత్రి.. సతీష్ కుమార్ 11:50 నిమిషాలకు గుంతకల్ రైల్వే స్టేషన్ కు వచ్చినట్లు గుర్తించారు. రైల్వే స్టేషన్ పార్కింగ్లో బైక్ పార్క్ చేసినట్లు సిసి కెమెరాల్లో రికార్డు అయింది. రైల్వే స్టేషన్ పార్కింగ్ ఏరియాలో సతీష్ కుమార్ బైక్ అక్కడే ఉన్నట్లు గుర్తించారు. అదే రైల్వేస్టేషన్లో అతను రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కినట్లు విచారణలో వెళ్లడైంది. దీనితో రైల్వే స్టేషన్ కి ఎవరెవరు వచ్చారు, అతనితోపాటు ట్రైన్ లో ఎవరెవరు ప్రయాణించారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

