మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు. సాయం అడిగిన వారికి ఆపన్న హస్తం అందివ్వాలి. అలా అని అపాత్ర దానం చేస్తే.. మొదటికే మోసం వస్తుంది కూడా. అందుకే సాయం అందించే ముందు.. కాస్త ముందు వెనుక ఆలోచించాలంటారు కూడా. కానీ ఏపీలో ఇప్పుడు సాయం అందించడం కూడా ఇబ్బందిగానే మారింది. వైద్య, విద్య సాయం అందించినా కూడా.. అందులో రాజకీయ కోణం బయటకు తీస్తున్నారు.
Also Read : మరో భారత్.. పాక్ పోరు చూస్తామా..?
ఆరోగ్య సమస్యలున్నాయని అడిగితే చాలు.. తన మన అనే బేధం లేకుండా స్పందిస్తున్నారు మంత్రి నారా లోకేష్. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే చాలు.. వెంటనే తన బృందాన్ని పంపించి.. బాధితుల వివరాలు సేకరించి.. వారికి కావాల్సిన సాయం అందిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో లక్షల్లో కూడా ఖర్చు అవుతోంది. అయినా సరే.. లోకేష్ మాత్రం వెనుకడుగు వేయటం లేదు. ఇతర దేశాల్లో ఇబ్బందులు పడుతున్న వారు పెట్టే సెల్ఫీ వీడియోలతో పాటు ఇతర రాష్ట్రాల్లో వైద్య సహాయం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా నేనున్నా అంటూ సాయం చేస్తున్నారు లోకేష్.
నిన్నటి వరకు టీడీపీ నేతలతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులను కూడా నీచంగా దూషించిన వారికి కూడా ఇప్పుడు లోకేష్ సాయం చేస్తున్నారు. దీనిపై కొన్ని విమర్శలు వస్తున్నా కూడా లోకేష్ ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. అటు సాయం కోరిన వారిని కూడా టీడీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మీ జగన్ అన్న సాయం చేయనన్నారా.. అని ఎద్దేవా చేస్తున్నారు. మా లోకేష్ అన్నకు మీరు అన్న మాటలు గుర్తు లేవు అనుకుంటా.. అంటూ సెటైర్లు వేస్తున్నారు.
Also Read : పాక్ క్రికెటర్లకు భారత్ షాక్..!
అయితే ఇప్పుడు ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకునేలా ఉంది. ఆరోగ్య సమస్యలపై మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో స్పందిస్తున్న తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కానీ ఇది నెమ్మదిగా రాజకీయ రంగు పులుముకుంటోంది. అదే సమయంలో ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టేలా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు అందటం లేదా.. అందుకే వైద్య సహాయం కోసం సోషల్ మీడియాలో ప్రజలు ఏకరువు పెడుతున్నారా.. బాధితులకు మెరుగైన వైద్యం కావాలంటే ప్రైవేటు ఆసుపత్రులు వెళ్లాల్సిందేనా అనే మాటలు వినిపిస్తున్నాయి.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణం, సూపర్ సిక్స్ అమలు కోసమే ఎక్కువగా ఖర్చు చేస్తోంది. ఇందుకోసం అయ్యే నిధులను ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పుగా, ప్రజలు కట్టే పన్నుల నుంచే కేటాయిస్తున్నారు. ఓ వైపు వేల కోట్లు అప్పులు చేస్తున్న ప్రభుత్వం.. ప్రజలకు కనీసం మెరుగైన వైద్య సేవలు అందించలేకపోతుందనే అపవాదు మూట గట్టుకుంటోంది. ఇదే విషయాన్ని వైసీపీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు.
నాలుగు రోజుల క్రితం ఓ హెడ్ కానిస్టేబుల్ ఓ పది మంది చిన్నారులకు తన సొంత డబ్బులతో బూట్లు, చెప్పులు కొనిచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్.. “పెనమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం స్పందించిన తీరుకు హాట్సాఫ్..” అంటూ ప్రశంసించారు. అయితే దీనిపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో ప్రశ్నించారు. “లోకేష్ అన్న.. నువ్వు ఇచ్చిన బూట్లు ఏమయ్యాయి..? క్వాలిటీ లేక పోయాయా..? అసలు ఇవ్వకుండా మింగేసావా..?” అంటూ పోస్ట్ చేశారు.
Also Read : విజయవాడ ఎక్స్ పో చీఫ్ గెస్ట్..?
ఏది ఏమైనా సరే.. సాయం చేయడం తప్పు కాదు.. అలా అని ప్రభుత్వం అందిస్తున్న సేవలు కాదని.. ఇలా చేయడం వల్ల మాత్రమే ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం అందిస్తున్న మాట వాస్తవం. అదే సమయంలో ప్రైవేటు ఆసుపత్రులకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవల రూపంలో కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య వసతులు మరింత మెరుగు పరిస్తే.. ఇలా మాటలు పడాల్సిన అవసరం రాదు కదా అనేది విశ్లేషకుల మాట.