చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ చుక్కలు చూపిస్తారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి అనుకూలంగా పని చేస్తున్న ప్రతి ఒక్కరి పైన తప్పకుండా చర్యలుంటాయి. తప్పు చేసిన ప్రతి ఒక్క అధికారిపైన చట్టపరమైన చర్యలుంటాయి.. ఇవి ఎన్నికల ముందు టీడీపీ నేతలు చెప్పిన మాట. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఏదో ఒకరిద్దరి విషయంలో తప్ప మిగిలిన వారి విషయంలో తెలుగు తమ్ముళ్ల అంచనాలు తలకిందులయ్యాయి.
Also Read : మావోల సంచలన ప్రకటన.. అతనికి స్ట్రాంగ్ వార్నింగ్..!
అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి అనుకూలంగా వ్యవహరించి.. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధించిన ఒకరిద్దరిపై మాత్రమే చర్యలు తీసుకున్నారు తప్ప.. మిగిలిన వారిని పూర్తిగా వదిలేశారనే మాట వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. చంద్రబాబు సీఎం అయ్యింది వైసీపీ ఐఏఎస్ల కోసమేనా.. అని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. తనను నమ్ముకున్న వారి కంటే కూడా తాను నమ్మిన వారికే పెద్ద పీట వేస్తారు చంద్రబాబు. ఇప్పుడు కూడా అలాంటి వారికే కీలక పోస్టింగులు ఇచ్చారనే మాట వినిపిస్తోంది.
ప్రస్తుతం కీలక స్థానాల్లో ఐఏఎస్ అధికారుల్లో కొందరు గత వైసీపీ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన వారే. వారిపైన అవినీతి ఆరోపణలు బాగానే వచ్చాయి. అలాంటి వారే ప్రస్తుతం ముఖ్యమైన పోస్టుల్లో ఉన్నారనేది టీడీపీ నేతల ఆరోపణ. అవినీతిపరులను అందలం ఎక్కించేందుకు అధికారంలోకి వచ్చినట్లు ఉందంటున్నారు. అభిమానులను పూర్తిగా పక్కన పెట్టిన చంద్రబాబు.. గతంలో తిట్టిన వారికే ప్రాధాన్యత పోస్టులు దక్కటంతో విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ఆ స్టార్ హీరో కార్ల కలెక్షన్ తెలుసా..?
వైసీపీ అధికారిగా ముద్ర పడిన ప్రద్యుమ్నతో పాటు విజయానంద్కు కూడా ఇప్పుడు కీలక పోస్టింగ్ ఇచ్చారు చంద్రబాబు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఎనర్జీ శాఖాధిపతి పోస్టు కూడా విజయానంద్కు దక్కింది. ఇక గత ప్రభుత్వంలో పెత్తనం చెలాయించి రిటైర్డ్ అయిన బి.రాజశేఖర్, హరి జవహర్ లాల్కు ఇప్పుడు కీలక పోస్టింగ్లు దక్కాయి. ఏడాది సర్వీస్ పొడిగింపుతో పాటు అత్యంత ప్రాధాన్యత ఉన్న వ్యవసాయ, పశుసంవర్థన, కో ఆపరేటివ్, మార్కెటింగ్ శాఖలను రాజశేఖర్కు కేటాయించారు. దేవాదాయ శాఖ కార్యదర్శి పదవి హరి జవహర్ లాల్కు దక్కింది. ఇక ఎంతో ప్రాధాన్యత ఉన్న పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను కూడా గతంలో చక్రం తిప్పిన అధికారికే ఇచ్చారు. అనేక మంది వైసిపి ముద్ర వారికే ప్రాధాన్యత పోస్టులు దక్కాయన్నది వాస్తవం. దీంతో తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. వీరి కోసమేనా కష్టపడి పార్టీని గెలిపించింది అని విమర్శలు చేస్తున్నారు.