విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎన్టీపీఎస్ నుంచి విడుదల అయ్యే బూడిద విషయంలో గత కొన్నాళ్ళుగా స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అడిగిన ప్రశ్నపై స్పందించిన మంత్రి.. ఎన్టీపీఎస్ నుంచి వెలుబడుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని హామీ ఇచ్చారు.
Also Read : సంచలనం.. తిరుమలలో మరో అపచారం బహిర్గతం
కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు ఎన్టీపీఎస్ లో మరమత్తులు చేపడుతున్నామన్నారు. పాండ్ యాష్ అక్రమ నిల్వ చేసి, తరలిస్తున్న కారణంగా స్థానికంగా కాలుష్యం జరిగేదన్న ఆయన, పీసీబీ సూచనల ప్రకారం బూడిద తరలింపుకు ప్రభుత్వం టెండరింగ్ ఏజెన్సీని నియమించిందని క్లారిటీ ఇచ్చారు. కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కోల్ స్టోరేజ్ షెడ్ ను నిర్మిస్తున్నామన్నారు. కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేర కాలుష్య నివారణకు రూ. 50 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.
ఎన్టీపీఎస్ కాలుష్య నివారణకు పునరుద్ధరణ, ఆధునికీకరణ లో భాగంగా కొత్త పరికరాలను అమర్చడం కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. టెండరింగ్ ఎజెన్సీ ద్వారా స్థానికుల జీవనోపాధి దెబ్బతింటుందనేది అసత్య ప్రచారం మాత్రమేనని, ఎన్టీపీఎస్ చుట్టుపక్కల గ్రామాల ప్రజల జీవనోపాధి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని హామీ ఇచ్చారు. బూడిద తరలింపుకు స్థానిక ప్రజల ట్రక్కులనే జెన్కో ఉపయోగిస్తుందన్నారు. బూడిద తరలింపు కోసం లోడింగ్ ఉచితంగా చేయడంతో పాటు రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.
Also Read : లిక్కర్ స్కామ్ ని మించిన మరో కుంభకోణం బయటపెట్టిన ఏబివి
బూడిద తరలింపు టెండర్ పై స్థానికులు ఆందోళన చెందాల్సినవసరం లేదన్నారు. స్థానికుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకునే టెండర్ ను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. స్థానికుల ప్రజల ఆరోగ్య సమస్యపై కూడా విద్యుత్ శాఖ దృష్టి సారించిందన్నారు. విద్యుత్ ఉద్యోగులతో సమానంగా మెడికల్ ప్యాకేజ్ ను అమలు చేస్తున్నామని, ఏపీ జెన్కో మొబైల్ మెడికల్ యూనిట్లతో పరిసర గ్రామాల్లో ప్రతీ గడపను చేరుకుంటుందని స్పష్టం చేసారు. స్థానిక గ్రామాల్లో ప్రజల ఆరోగ్య సమస్యలను తెలుసుకుని ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తున్నామన్నారు మంత్రి.