మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం వాడి వేడిగా జరిగింది. రాబోయే రోజుల్లో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల పై నాయకులకి దిశా నిర్దేశం చేయడం కోసం ఏర్పాటు చేసిన ఈ కీలక సమావేశానికి అనేకమంది పార్టీ నాయకులు రావపోవడం పార్టీలో చర్చనీయాంశం అయింది. ముఖ్యంగా ఎమ్మెల్యేల విషయంలో అలాగే కొంతమంది పార్టీ నాయకుల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు అనుసరిస్తున్న వైఖరిని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. దాదాపు 56 మంది ఎమ్మెల్యేలు హాజరు వేయించుకుని వెళ్ళిపోయారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక 15 మంది ఎమ్మెల్యేలు అసలు సమావేశానికి కూడా రాలేదని బహిరంగంగానే చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Also Read : అదరగొడుతున్న పెమ్మసాని స్పీచ్ లు
పార్టీని, ప్రజలను సీరియస్ గా తీసుకోలేని వారు రాజకీయాల్లో ఉండకూడదు అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విదేశీ పర్యటనలతో పాటుగా దైవదర్శనాలకు వెళ్లిన నాయకులను తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తానా సభల కోసం ముందుగానే ఎమ్మెల్యేలు కొందరు అమెరికా వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు అందరి జాబితా తన వద్ద ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎవరెవరు ఏమి చేస్తున్నారో, ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరు విదేశాల్లో ఎక్కువగా ఉంటున్నారో అన్న సమాచారం తనవద్ద ఉందని, అలాంటి వారు ఇక విదేశాల్లోనే ఉండిపోవడం మంచిదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read : మంత్రులలో ప్రోగ్రెస్ రిపోర్ట్ భయం..?
ఒకసారి సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలు ఎవరో చూస్తే.. తంగిరాల సౌమ్య, భూమా అఖిలప్రియ, సొంగ రోషన్ కుమార్, నందమూరి బాలకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పల్లె సింధూర రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకర్ల సురేష్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చదలవాడ అరవింద్ బాబు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, వెలగపూడి రామకృష్ణ, పితాని సత్యనారాయణ, వసంత కృష్ణ ప్రసాద్, గౌతు శిరీష, గుమ్మనూరు జయరాం, తురిగుండ్ల రామకృష్ణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలానే ఎంపీల విషయానికి వస్తే విశాఖ ఎంపి భరత్, విజయనగరం ఎంపి అప్పలనాయుడు, బాపట్ల ఎంపి కృష్ణ ప్రసాద్ గైర్హాజరయ్యారు. వీరితో పాటు దాదాపు 32 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసి బయటకు వెళ్లిపోయినట్లు చంద్రబాబు గుర్తించారు.