ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయం కాస్త హాట్ హాట్ గానే కనపడుతోంది. అధికారం కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇక దూకుడు పెంచి రాజకీయం చేయాలని కాస్త పట్టుదలగా ఉన్నట్లు వైసీపీ వర్గాలు తెలుపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్ గట్టిగా స్కెచ్ రెడీ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్ధమవుతుంది. ఇటీవలి కాలంలో పెద్దగా బయట కనపడని జగన్ త్వరలోనే సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. సిక్కోలు నుంచి చిత్తూరు వరకు పార్టీలో కీలక మార్పులకు ఆయన శ్రీకారం చుట్టే అవకాశం స్పష్టంగా కనపడుతోంది.
పార్టీలో మార్పులకి తోడు ఆయన ప్రజల్లోనే ఉండే విధంగా వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే గుంటూరు, నెల్లూరు జైళ్లలో ఉన్న తమ నేతలను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో భారీ ప్రజా స్పందన ఉన్నట్లు వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో జగన్ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు చెబుతున్నారు. దాదాపు 110 నియోజకవర్గాల్లో ఇంచార్జ్ లను కొత్తవారిని నియమించాలని ప్లాన్ చేస్తున్నారు జగన్.
Read Also : వైసీపీ నుంచి బాలినేని అవుట్..!
అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో కొత్త ఇంచార్జ్ లను ప్రకటించే ప్లాన్ చేస్తున్నారు. ఉన్న వారిలో చాలా మంది పార్టీ మారే అవకాశం ఉండటంతో మొత్తం వెనుకబడిన వర్గాలకు చెందిన వారిని, చిన్న చిన్న వ్యాపారస్తులను ఆయన పార్టీలో ప్రోత్సహించాలని ప్లాన్ చేస్తున్నారు. అవసరమైతే వారికి ఆర్ధిక సహకారం కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కార్యకర్తల్లో ఉత్సాహంగా పని చేసేవారికి నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించే ఆలోచనలో ఉన్నారు.
అలాగే పేరున్న సర్పంచ్ లు, పరిషత్ ఎన్నికల్లో గెలిచిన వారిని ఇప్పుడు ముందుకు తెచ్చే ప్లాన్ లో ఉన్నారట ఆయన. రెండేళ్ళలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా జగన్ ఇప్పటి నుంచే ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. అందుకే కొత్త ఇంచార్జ్ లను నియమించి వారికి స్వేచ్చ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇప్పుడు సైలెంట్ అయిపోయిన వారిని తొలగించే అవకాశం కనపడుతోంది. పార్టీ మారతారు అని అనుమానం ఉన్న వాళ్ళను కూడా ఆయన ముందే పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై ఒక కమిటీని నియమించి ప్రణాళిక సిద్దం చేయనున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమం మొదలయింది. నిరసన కార్యక్రమాలను కూడా మండల స్థాయిలో నిర్వహించాలని అవసరమైతే తాను పర్యటించాలని జగన్ భావిస్తున్నారు.