వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో యూరియా కొరతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు చేసిన జగన్.. యూరియా దొరకక రైతులు నానా పాట్లు పడుతున్నారన్నారు. రైతులకు యూరియా అందించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వానికి రైతులంటే కనీస గౌరవం లేదని.. అందుకే ముందే యూరియాను సిద్ధం చేయడంలో నిర్లక్ష్యం చేశారన్నారు.
Also Read : ఈవీఎంలా..? బ్యాలెట్టా..? చంద్రబాబు సర్కార్ ముందు గోల్డెన్ చాన్స్
ఏపీలో యూరియా కొరతకు ప్రభుత్వ చిత్తశుద్ధి లోపమని జగన్ ఆరోపించారు. ఏపీలో ముఖ్యమంత్రి, అధికారులు మారారన్న జగన్.. రైతులు ఎవరి సమయంలో ఇబ్బందులు పడ్డారో తెలుసుకోవాలన్నారు. 2019-24 మధ్య రైతులు ఎలాంటి ఇబ్బందులు పడలేదని.. ప్రతి రైతుకు యూరియా అందుబాటులో ఉంచామన్నారు. కోవిడ్ సమయంలో కూడా రైతులకు కనీస మద్దతు ధర అందించామన్నారు. కానీ ఇప్పుడు మాత్రం యూరియా కోసం రైతులు రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నారని జగన్ ఆరోపించారు.
Also Read : కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం..? ఏసీబీ విచారణలో సంచలనాలు
ఇక రైతులు యూరియా కోసం క్యూ లైన్లో ఉన్న ఫోటోలను మీడియా ముందు ప్రదర్శించారు వైఎస్ జగన్. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలను మూసివేశారన్నారు. వైసీపీ పాలనలో యూరియా కోసం రైతులు ఇబ్బంది పడలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఫోటోలు ప్రదర్శించిన జగన్.. కుప్పం, టెక్కలి ఫోటోలు చూపించిన సమయంలో.. సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుపైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ఏదైనా బావిలో దూకి చస్తే బెటర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా యూరియా కష్టాలు తీర్చాలని జగన్ డిమాండ్ చేశారు.