ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఇప్పుడు గడ్డు పరిస్థితి నడుస్తుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్తారు అనే దానిపై ఆ పార్టీ నేతలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికంటే ఇప్పుడు పరిస్థితి కాస్త దారుణం అనే చెప్పాలి. అధికారంలో ఉన్న సమయంలో చేసిన తప్పులతో క్యాడర్ తో పాటు ద్వితీయశ్రేణి నాయకత్వం ఆయనకు దూరమైంది అనే భావన నాయకుల్లో ఉంది. ఇప్పుడు కేవలం డబ్బులతో పార్టీ సోషల్ మీడియాను నడిపే పరిస్థితి నెలకొంది తప్ప సొంతగా ఎవరూ ముందుకు రావడం లేదు. వైసీపీ సోషల్ మీడియా కేవలం ఫేక్ వార్తల ప్రచారానికి తప్ప దేనికి ఉపయోగపడటం లేదు.
ఇక ఢిల్లీలో అయితే పరిస్థితి దారుణం అనే చెప్పాలి. ఢిల్లీలో వైఎస్ జగన్ కు అనుకూల వాతావరణం ఏ కోణంలో చూసినా కనపడటం లేదు. ఇక జగన్ ఢిల్లీ లో కాస్తో కూస్తో బలపడాలి అంటే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి అవసరం ఎక్కువగా ఉంటుంది. విజయసాయికి ఢిల్లీలో మంచి పరిచయాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా ఆయన పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంచితే విజయసాయి పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయనను రాజ్యసభకు పంపడం అంత సులువు కాదు జగన్ కు.
విజయసాయి పార్లమెంట్ లో లేకపోతే తనకు ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది అనుకున్న జగన్… ఎలా అయినా రాజ్యసభకు పంపేందుకు అవసరమైతే విజయసాయిని కాంగ్రెస్ లేదా వేరే ఇతర ఏ పార్టీలోకి అయినా పంపేందుకు ఆయన సిద్దంగా ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తెలంగాణా మాజీ సిఎం కేసీఆర్ కు విజయసాయి గురించి ఒక అవగాహన ఉంది. ఆ పార్టీకి రాజ్యసభకు సభ్యుడ్ని పంపే బలం ఉంది. లేదా కర్ణాటకలో కాంగ్రెస్ నుంచి అయినా రాజ్యసభకు విజయసాయి ని పంపాలని జగన్ కాస్త సీరియస్ గా వర్క్ చేస్తున్నారని మీడియా వర్గాలు సైతం అంటున్నాయి. జగన్ తాజా ఢిల్లీ పర్యటనలో అన్నీ తానై విజయసాయి వ్యవహరించారు. మరి విజయసాయి కి మరోసారి రాజ్యసభ అవకాశం ఉందో లేదో తెలియాలి అంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.