ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా దర్యాప్తు అధికారులు విచారణ వేగవంతం చేశారు. మద్యం కుంభకోణంలో కీలకంగా భావిస్తున్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వైయస్ జగన్ మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, వైయస్ భారతి వ్యాపార వ్యవహారాలు చూసే బాలాజీ గోవిందప్ప.. లను విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది.
Also Read : నేతల రాజీనామాల వెనుక కారణమదే..!
తాజాగా దర్యాప్తు అధికారుల నుంచి ఓ సమాచారం.. మీడియాకు అందింది. మద్యం కుంభకోణంలో కీలకంగా భావిస్తున్న కొంతమంది వ్యక్తులతో వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తో వైయస్ జగన్ ఐఫోన్ లో ఫేస్ టైం నుంచి.. అలాగే సిగ్నల్ యాప్ నుంచి.. కమ్యూనికేషన్ నడిపినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలను అధికారులు సేకరించి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు కూడా పంపినట్లు సమాచారం. ముఖ్యంగా కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని విచారించిన సమయంలోనే పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.
Also Read : ముఖ్యమంత్రి పీ4 ఆదర్శంగా.. గొట్టిపాటి అడుగులు..!
కేసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న కొన్ని అంశాలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. జగన్ కోసమే తాను ముడుపులు తీసుకున్నానని కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంగీకరించినట్లు పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇక దీనిపై పలువురిని లోతుగా విచారించిన తర్వాత జగన్ ఐఫోన్ ద్వారా కమ్యూనికేషన్ నడిపినట్లు గుర్తించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో కూడా ఐఫోన్ కీలకంగా మారింది. మరి దీనిపై దర్యాప్తు సంస్థలు ఎంతవరకు ముందుకెళతాయనేది చూడాలి.