విడదల రజినీ… తెలుగు రాజకీయాల్లో పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. తెలుగుదేశం పార్టీ మహానాడు వేదిక పైన “సైబరాబాద్లో మీరు నాటిన మొక్కను సార్ నేను” అంటూ చంద్రబాబు పైన పొగడ్తల జల్లు కురిపించిన రజిని… సరిగ్గా ఏడాదికే వైసీపీలో చేరిపోయారు. సీనియర్లను కాదని ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు. అనతి కాలంలోనే పార్టీలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్న రజినీ… సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ కూడా. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రిపదవి కూడా పొందారు.
Also Read : తమదాక వచ్చాకే నొప్పి తెలిసిందా..!
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రజినీని మంత్రి పదవి వరించడం వెనుక వైసీపీలో నెంబర్ టూ స్థాయి వ్యక్తి లాబీయింగ్ ఉందనే పుకార్లు పెద్ద ఎత్తున షికారు కూడా చేశాయి. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి సీనియర్ నేత, రాజకీయ గురువు ప్రత్తిపాటి పుల్లారావుపై ఘన విజయం సాధించిన విడదల రజినీకి జగన్ గట్టి షాక్ ఇచ్చారు. సరిగ్గా ఎన్నికలకు ఐదు నెలల ముందు రజినీని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. టీడీపీ కంచుకోటగా గుర్తింపు తెచ్చుకున్న గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో గెలవాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. అందుకే అప్పట్లో కార్యాలయంపై దాడి చేశారని… తనపై హత్యాయత్నానికి ప్రయత్నించారంటూ హడావుడి చేశారు కూడా.
అదే సమయంలో తన దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ వైసీపీ నేతలే బహిరంగంగా ఆరోపణలు చేయడంతో.. రజినీ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. బీసీ కార్డు ద్వారా ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమించినప్పటికీ… పెద్దగా ఫలితం చూపించలేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కొద్ది రోజుల పాటు సైలెంట్గా ఉన్నారు. ఒక దశలో రజినీ కూడా పార్టీ మారుతారనే మాట బలంగా వినిపించింది. ఇక మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని బుజ్జగించే బాధ్యతలను విడదల రజినీకే జగన్ అప్పగించారు. అందుకోసం రజినీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
Also Read :అసెంబ్లీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన అయ్యన్న
ఇక మొన్నటి ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన కావలి మనోహర్ నాయుడు ఓడిన తర్వాత అడ్రస్ లేకుండా పోయారు. దీంతో చిలకలూరిపేట నియోజకవర్గం ఇంఛార్జ్ బాధ్యతలను విడదల రజినీకి మరోసారి అప్పగించి షాక్ ఇచ్చారు జగన్. వాస్తవానికి రజినీకి చిలకలూరిపేటలో మంచి పేరు లేదు. భూ కబ్జా ఆరోపణలతో పాటు స్థానిక క్యాడర్తోనే సఖ్యత లేదు. అందుకే రజినీని గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి జగన్ మార్చారు. అయితే ఇప్పుడు మళ్లీ చిలకలూరిపేట బాధ్యతలు అప్పగించడంతో స్థానిక నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రజినీని మార్చకపోతే… తామంతా మారిపోతామని జగన్కు అల్టిమేటం జారీ చేశారు.