ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అయ్యింది. మరో నాలుగు నెలల్లో తాము అధికారంలోకి వస్తామంటున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ను బెదిరించిన సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకముందే ఈ తరహా వ్యాఖ్యలను ఓ మాజీ ముఖ్యమంత్రి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఇది చిన్న విషయం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు ప్రధానంగా కూటమిలో విబేధాలే కారణమనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.
Also Read : ఏపీకి అమిత్ షా.. పక్కా పొలిటికల్ టూర్…?
ఏపీలో వైసీపీని ఓడించేందుకు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఎన్నికల్లో అన్ని పార్టీల నేతలు కలిసికట్టుగా పనిచేయడంతో వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఆ తర్వాత మూడు పార్టీల నేతలు కూడా ప్రభుత్వంలో భాగమయ్యారు. అంత వరకు బాగానే ఉంది. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు మాత్రం కూటమి సర్కార్ను ఇబ్బంది పెడుతున్నాయి. ప్రధానంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేశం, బీజేపీ నేతల విమర్శలు కలిసి టీడీపీని ఇరుకున పెడుతున్నాయి.
ఎప్పటికీ టీడీపీతో కలిసే ప్రయాణం చేస్తామని చెబుతున్న పవన్ కల్యాణ్.. పిఠాపురంలో, తిరుపతిలో మాత్రం కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేశారు. అసలు పోలీసు వ్యవస్థ ఉందా అంటూ పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలు హోమ్ మంత్రి అనితను ఇబ్బందిపెట్టాయి. తాజాగా తిరుపతి తొక్కిసలాట ఘటనపై కూడా పవన్ ఘాటు వ్యాఖ్యలే చేశారు. కొంతమంది నిర్లక్ష్యం వల్ల తాము క్షమాపణ చెప్పాల్సి వస్తుందని విమర్శించారు. టీటీడీ బోర్డు సభ్యులు స్వయంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కూడా. ఈ వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ నేతలకు కాస్త ఇబ్బంది కలిగించాయి.
Also Read : కోడిపందాలపై చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్
అదే సమయంలో వైసీపీ నేతలు బీజేపీలో చేరడాన్ని కొందరు టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి ఆనంద్ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దీనిని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్రంగా తప్పుబట్టారు. నర్సీపట్నం నియోజకవర్గంలో అడారి ఆనంద్ తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని… అలాంటి వారిని పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు అయ్యన్నపాత్రుడు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అదే సమయంలో తాడిపత్రి నియోజకవర్గంలో మునిసిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై బీజేపీ మహిళా నేతలు విమర్శలు చేయడం.. వారిపై జేసీ ఘాటు వ్యాఖ్యలు చేయడం.. పెద్ద దుమారం రేపాయి కూడా. ఇవన్నీ లెక్క వేసుకున్న తర్వాతే వైఎస్ జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది.




