ఆంధ్రప్రదేశ్ లో ముంబైకి చెందిన ఒక హీరోయిన్ ని వేధించిన వ్యవహారం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో ఎవరు ఉన్నారనే దానిపై ఇప్పుడు పోలీసులు, ప్రజలు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఏపీలో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తితో పాటు, విజయవాడ పోలీసులు సహకారంతో ముంబై నటిని వేధింపులకు గురిచేసారని ఆరోపణలు వస్తున్నాయి. ఏడు నెలల తర్వాత ఈ వ్యవహారంలోని విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.
ప్రముఖ వ్యాపారవేత్త మనవడు గుజరాత్ కు చెందిన నటిని ప్రేమించాడట. చాలా కాలం ఇద్దరూ సన్నిహితంగా గడిపారు. పెళ్లి చేసుకోవాలని సదరు నటి అడగడంతో అది ఇష్టం లేని వ్యాపారవేత్త దూరం పెట్టాలని చూడటం జరిగిందని తెలుస్తుంది. అయితే ఆ నటి పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో ఎలాగైనా వదిలించుకోవాలనే ఉద్దేశంతో దారి చూపాలని అప్పటి ప్రభుత్వంలో ఒక కీలక సలహాదారుడు వద్దకు వెళ్ళారు. విషయం అర్ధం చేసుకున్నా ఆ కీలక నాయకుడు అధికారాన్ని ఉపయోగించుకుని స్థానికంగా ఒక నాయకుడి చేత కేసు ఫైల్ చేయించి, అధికారులని పంపించి వారి కుటుంబాన్ని ముంబై లో అరెస్ట్ చేయించి, విజయవాడ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారని వార్తలు వస్తున్నాయి.
జనవరి నెలలో ముంబయి వెళ్లి… ఆ నటిని విజయవాడ తీసుకొచ్చి… కొండపల్లి ఖిల్లాలో ఉంచి… నానా చిత్ర హింసలకు గురి చేసారు. దాదాపు 14 రోజులు రిమాండ్ లో ఉంచి బెదిరించినట్లు సమాచారం. ఆమె ఫోన్ కాల్ లిస్టు ని కూడా డిలీట్ చేసారు. అలాగే ఫోటోలు కూడా డిలీట్ చేసి అతనికి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు హింది, ఇంగ్లీష్, గుజరాతి మినహా మరో భాష రాదూ. దీనితో ఆమెతో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు అధికారులు.
మువ్వ మండలంలోని ఒక వ్యక్తి ద్వారా ఫిబ్రవరిలో కేసు నమోదు చేయించి… 5లక్షలు వసూలు చేసినట్టు సాక్ష్యాలు సృష్టించి జైలుకి పంపారు. పరువు పోతుందని ఆ విషయాన్ని ఎక్కడా కుటుంబ సభ్యులు బయటపెట్టలేదు. అయితే ఇప్పుడు మీడియాలో వార్తలు రావడంతో ఆ కుటుంబం ముంబై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఇప్పుడు నటి కుటుంబం మీడియాతో అన్ని వివరాలు చెబుతారా లేక ఇబ్బందులు ఎందుకని మౌనంగా ఉండిపోతారో చూడాలి.




