గిర గిరా తిప్పేసిన అశ్విన్ జడేజా, ఆరేసిన అశ్విన్, మడత పెట్టేసిన జడేజా… భారత్ లో టీం ఏ సీరీస్ గెలిచినా మీడియాలో ఉండే హడావుడి ఇది. అంతే గాని స్వింగ్ తో చుక్కలు చూపించిన ఫాస్ట్ బౌలర్ అంటూ ఏ ఒక్క వార్త కూడా ఇండియా విజయాల్లో కనపడదు. ఇక్కడి పిచ్ లు కూడా తిప్పడానికి, మడత పెట్టడానికి అనుకూలంగా ఉంటాయి. కాని సేనా పిచ్ లు అలా ఉండవు. సేనా అంటే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఆస్ట్రేలియా. ఈ నాలుగు దేశాల్లో పిచ్ లు అక్కడి వాతావరణం బట్టి ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలంగా తయారు చేస్తారు.
మన దేశంలో అలా ఉండే పిచ్ ఒక్కటే… ఈడెన్ గార్డెన్స్. గంగూలి బోర్డు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆ పిచ్ ని ఫాస్ట్ బౌలింగ్ కి అనుకూలంగా మార్చాడు. ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడానికి భారత్ కు ఇదే మంచి సమయం. గత రెండు పర్యటనలలో విజయం సాధించింది. కాని ఇప్పుడు ఆస్ట్రేలియా చాలా బలంగా కనపడుతోంది. బలంతో పాటు మంచి కసితో ఉంది. కాబట్టి బౌలింగ్ విభాగం ఎంత బలంగా ఉంది అనే దానిపైనే మన విజయవకాశాలు ఆధారపడి ఉంటాయి.
Read Also : హైడ్రాను వ్యూహాత్మకంగా డైవర్ట్ చేసారా…?
ఇప్పుడు ఉన్న బౌలింగ్ విభాగంలో బూమ్రా ఒక్కడే బలంగా కనపడుతున్నాడు. సిరాజ్ ఉన్నా కూడా నామ మాత్రమే. చిన్న జట్లపై తప్పించి పెద్ద జట్లపై అతని ప్రభావం ఎప్పుడూ జనాలు చూడలేదు. ఇక మహ్మద్ శమీ తిరిగి రావాల్సిన అవసరం ఉంది. అతనికి గాయం మళ్ళీ తిరగబెట్టింది అనే వార్తలు వస్తున్నాయి. షమికి ఆస్ట్రేలియా పిచ్ లపై మంచి అనుభవం ఉంది. గతంలో గబ్బాలాంటి మైదానాల్లో 5 వికెట్ల ప్రదర్శన కూడా చేసాడు. కాబట్టి షమీ అనుభవం అనేది టీంకు చాలా అవసరం. ఇక ఆకాష్ దీప్ ఎంత వరకు ప్రభావం చూపిస్తాడో చెప్పలేం, బౌలింగ్ లో రిథం ఉన్నా ఇక్కడి పిచ్ లపై బౌలింగ్ చేసి అది కోల్పోతున్నాడు.
కాబట్టి ఇప్పుడు బోర్డు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. న్యూజిలాండ్ సీరీస్ తర్వాత ఫాస్ట్ బౌలర్స్ ను వెంటనే ఆస్ట్రేలియా పంపాలి. మయాంక్ యాదవ్ కూడా జట్టులోకి వస్తున్నాడు. కాబట్టి అతని పేస్ కూడా జట్టుకి ఉపయోగమే. కాబట్టి బూమ్రా, ఆకాష్ దీప్, మయాంక్ ను వెంటనే ఆస్ట్రేలియా పంపి అక్కడి పరిస్థితులకు అలవాటు పడేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. లేదంటే మాత్రం ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఓ ఆట ఆడుకుంటారు. గత ఏడాది జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లో ఈ విషయంలో క్లియర్ గా అర్ధమైంది.