పార్టీ మారిన నేతలు ఇప్పుడు ఏమయ్యారు… వారంతా ఇప్పుడు ఎక్కడున్నారు… ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. రాజకీయ పార్టీల నేతలు పార్టీలు మారడం సర్వసాధారణం. అధికారంలో ఉన్న పార్టీలో చేరడం వల్ల తమ రాజకీయ భవిష్యత్తుకు, వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు. అయితే ఇలా పార్టీలు మారిన నేతలు ఇప్పుడు ఏమయ్యారో కూడా తెలియటం లేదు. 2019లో ఎన్నికలకు ముందు పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరారు. అలా చేరిన వారిలో అవంతి శ్రీనివాస్కు మాత్రమే మంత్రిపదవి దక్కింది. మిగిలిన వారికి పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి.
2014లో టీడీపీ తరఫున అమలాపురం ఎంపీగా ఎన్నికైన పండుల రవీంద్రబాబు సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అయితే ఆయనకు జగన్ ఎంపీ టికెట్ ఇవ్వలేదు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఆయన కనిపించటం లేదు. ఇక 2019 ఎన్నికల తర్వాత టీడీపీ తరఫున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు ఇచ్చారు. కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ వైసీపీ కండువా కప్పుకున్నారు. వీరిలో వల్లభనేని వంశీతో పాటు కరణం బలరామ్ కుమారుడు వెంకటేశ్కు మాత్రమే జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. మిగిలిన ఇద్దరిని పెద్దగా పట్టించుకోలేదు.
గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మద్దాలి గిరితో కనీసం ఒక్కసారి కూడా జగన్ భేటీ అవ్వలేదు. దీంతో సరిగ్గా ఎన్నికల ముందు గిరి హ్యాండ్ ఇచ్చారు. ఇక వాసుపల్లి గణేష్ చుట్టూ విశాఖ లోకల్ నేతలు గరంగరంగా ఉన్నారు. చివరికి విశాఖ సౌత్ నియోజకవర్గం ఇంఛార్జ్ పదవి నుంచి గణేష్ను తప్పించేందుకు లోకల్ వైసీపీ నేతలే పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం… గణేష్ ఎక్కడా కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలకి మోగిన నగారా
ఇక గన్నవరం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేసిన వల్లభనేని వంశీ.. ఓటమి తర్వాత మాయమైపోయారు. గతంలో చేసిన వ్యాఖ్యలు, దాడుల నేపథ్యంలో వంశీని కేసులు చుట్టుముట్టాయి. దీంతో అసలు రాజకీయాలకే గుడ్ బై చెప్పేందుకు కూడా వంశీ రెడీ అయినట్లు తెలుస్తోంది. కూటమి గెలిచిన నాలుగు నెలల్లో కేవలం ఒక్కసారి మాత్రమే… అది కూడా మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి ప్రెస్ ముందుకు వచ్చారు. అంతే తప్ప.. కనీసం నియోజకవర్గ నేతలకు కూడా వంశీ అందుబాటులో లేకుండా పోయారు. ఇక కరణం కుటుంబం కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా వైసీపీకి మద్దతు తెలిపారు. ఇక 2024 ఎన్నికల్లో అమలాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాపాక… జగన్ తీరు నచ్చలేదని… అందుకే వైసీపీకి గుడ్ బై అని చెప్పేశారు. ఇక వైసీపీకి మద్దతు తెలిపిన కాపు నేత ముద్రగడ పద్మనాభం కూడా ఎన్నికల్లో పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటా అని శపథం చేశారు. చెప్పినట్లుగానే ఎన్నికల ఫలితాల తర్వాత పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్నారు. అలాగే రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారు.