తెలంగాణలో ఎమ్మెల్యేలకు క్లాస్ పీకాలని ప్రభుత్వం నిర్ణయించింది. సడెన్గా తీసుకున్న నిర్ణయం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్గా మారింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రెండు రోజుల పాటు శిక్షణా తరగతులు నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు బ్రేక్ ఇచ్చి మరీ క్లాసులు పెట్టడం వెనక రహస్యం ఏమిటనే చర్చ ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.
కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 11,12 తేదీల్లో హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే సభ్యులు ఎన్నికైన సంవత్సరం తర్వాత సడెన్గా ఈ ట్రైనింగ్ క్లాస్లను తెరపైకి తీసుకురావడం అన్ని పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ట్రైనింగ్ క్లాసుల అసలు కారణం వేరే ఉందనే విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. అయితే అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు పెట్టినా.. ఇలాంటి వాటికి కేవలం అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తప్ప.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు గైర్హాజరు అవుతారు. దీనినే అట్వెంటేజ్గా తీసుకోవాలని హస్తం నేతలు భావిస్తున్నట్టు ఉంది.
Also Read : ఎవరీ వినయ్…? సాక్షి టూ మోహన్ బాబు యూనివర్సిటీ
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు కూడా నిర్వహించింది. ఈ ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మంచి పనులు చేసిందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. రైతు రుణమాఫీతో మొదలు.. ఉద్యోగ నియామకాలు ఇతరత్రా నిర్ణయాలపై ప్రభుత్వం మంచి పనులు చేసినప్పటికీ… క్షేత్రస్థాయిలో అనుకున్న మైలేజ్ రాలేదనే అసంతృప్తి ప్రభుత్వ పెద్దల్లో ఉంది. మరోవైపు ప్రతిపక్ష సభ్యులు చేస్తున్న ఆరోపణలకు ధీటుగా ప్రభుత్వం సమాధానాలు చెప్పలేకపోతోంది. ఇక ప్రభుత్వంపై వస్తున్న నెగెటివ్ ప్రచారం.. ప్రజల్లోకి వెళ్లినంతగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వంటివి జనాల్లోకి వెళ్లడం లేదని హస్తం నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
అసెంబ్లీలో ఈసారి మెజారిటీ సభ్యులు కొత్తగా ఎన్నికైన వారే. సభలో మొత్తం 119 మంది సభ్యుల్లో సగానికి మించి కొత్త సభ్యులు ఉన్నారు. అంటే 60 మందికి పైగా కొత్తగా ఎన్నికైన సభ్యులే అసెంబ్లీలో ఉన్నారు. ఈ కొత్త సభ్యుల్లో కూడా కాంగ్రెస్ నుంచి ఎన్నికైన వారు 45 మంది. వీరికి సభలో ఎలా వ్యవహరించాలనే విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గత పదేళ్లుగా అధికారంలో ఉండటం, ఆ పార్టీ సభ్యులు సీనియర్లు కావడంతో.. వాళ్లంతా కలిసి సభల్లో ప్రభుత్వంపై పై చేయి సాధిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ సభ్యుల్లో వెనకడుగు పడుతోందని.. ఈసారి అలా కాకుండా కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ సభ్యులకు మంచి శిక్షణ ఇవ్వాలని సర్కారు పెద్దలు భావించారు.
Also Read :జగన్ బాటలో రేవంత్… వాల్యూమ్ తగ్గించాలా…?
ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి కావడంతో.. ఇకపై సభలోనూ, బయట కూడా దూకుడుగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. తాము అనుకున్న టార్గెట్ సాధించడానికి ఈ ట్రైనింగ్ క్లాసులు ఎంతగానో ఉపయోగపడతాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక ఈ శిక్షణ తరగతులు కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు ఉపయోగపడుతాయో మాత్రం చూడాల్సి ఉంది.