గంగ తరువాత అంత పవిత్రమైనది యమునా నది. గంగలో మునిగితే లభించే పుణ్యం.. యమునలో మునకేసినా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు పొరపాటున మునకేస్తే.. పుణ్యం మాట తర్వాత… కావాల్సినన్ని జబ్బులు మాత్రం ఖాయం. రోగాల బారిన పడే అవకాశం ఉంది. నదీ జలాలు కాలుష్యంతో యమునా పరీవాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యమున కాలుష్యం ఇప్పుడు ఢిల్లీలో తాగునీటి ఎద్దడికి కూడా కారణమవుతోంది..
Also Read : పాపం… ఆయన మాట లెక్కచేయని సీనియర్లు…!
యమునా నదిలోని ప్రమాదకరమైన విషపు నురగలు.. గడ్డ కట్టిన మంచు ఫలకాలుగా కనిపిస్తున్నాయి. పరిశ్రమల నుంచి విడుదలైన వ్యర్థాలు నదిలో కలుస్తుండడంతో విషపు నురగలు తేలియాడుతున్నాయి. 90 శాతం వ్యర్థ జలాలు, 58 శాతం వ్యర్థాలు యమునా నదిలో కలుస్తున్నాయి. శుద్ధి చేయని మురుగు నీటిని కూడా యమునలోకే వదులుతున్నారు. మురుగు నీటిలో పాస్ఫేట్, ఆమ్లం ఉంటాయి. ఇవి విషపూరిత నురుగుగా ఏర్పడవుతున్నాయి. ఈ కారణంగానే కొన్ని రోజులుగా యమునా నదిలో భారీగా నురగలు వస్తున్నాయి.
Also Read : వారిద్దరి కష్టం… బూడిదలో పోసిన పన్నీరేనా..?
కార్తీక మాసం సందర్భంగా గంగ, యమునా నదుల్లో పుణ్యస్నానాలను ఆచరించి.. సూర్య భగవానుడికి పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఢిల్లీలోని కాలిందీ కుంజ్ ప్రాంతంలో భక్తులకు మరో మార్గంలేక.. విషపూరితమైన జలాల్లోనే పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. యమునలో వస్తున్న నురగలను పక్కకు తోసి కొందరు స్నానాలు చేస్తుండగా.. అవి విషపూరితమని తెలియక.. చిన్నారులు ఆ నురగలతోనే ఆడుకుంటున్నారు. యమునలో మునకేస్తే పుణ్యం దేవుడెరుగు.. రోగాల బారిన పడుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యమున విషపూరితమని తెలుసని.. అయినా మరోమార్గం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.