తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్గా మారాయి. ఓ వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. మరోవైపు బీసీ రిజర్వేషన్ బిల్లు వివాదం.. ఈ నెల 18న బంద్కు పిలుపునిచ్చిన బీసీలు.. ఇదే సమయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం.. వీటన్నిటికి తోడు అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలు. నిన్నటి వరకు మంత్రుల మధ్య విభేదాలు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో మంత్రి పొన్నం ప్రభాకర్.. చివరికి సారీ చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగింది. అంతకు ముందు మంత్రులు పొంగులేటి శ్రీనివాసులు రెడ్డికి, సీతక్కకు మధ్య ఆధిపత్య పోరు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చల్లారుతున్నాయనే సమయంలో మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ తొలగింపు అంశం పెద్ద దుమారం రేపుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్న కొండా సురేఖ తొలి నుంచి రెబల్గానే గుర్తింపు తెచ్చుకున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సురేఖపై అక్కినేని కుటుంబం పరువు నష్టం దావా వేసింది. ఈ కేసు కోర్టులో విచారణలో కొనసాగుతోంది.
Also Read : గ్రేటర్ బెజవాడ కొత్త లెక్క.. మొత్తం 75 గ్రామాలతో.. మండలాలు ఇవే
ఆ తర్వాత వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలతోనే కొండా కుటుంబానికి సఖ్యత లేకుండా పోయింది. జిల్లాలో కడియం శ్రీహరి, కొండా మురళీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తమ నియోజకవర్గంలో కడియం పెత్తనం ఏమిటని పార్టీ పెద్దలకు కొండా సురేఖ ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఇక మరో మంత్రి సీతక్కతో కూడా సురేఖకు సఖ్యత లేదు. ఆమెపై కూడా వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు కొండా సురేఖ. వరంగల్ జిల్లాలో దేవాదాయ శాఖకు చెందిన రూ.70 కోట్ల విలువైన పనులను తన అనుచరులకే కట్టబెట్టారని పొంగులేటిపై సురేఖ ఆరోపణలు చేశారు. దీనిని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. అలా చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఈ వివాదం కొనసాగుతుండగానే.. ఇప్పుడు ఓఎస్డీ సుమంత్ తొలగింపు వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది.
Also Read : ఎన్టీఆర్ కు ఏమైంది..? ఫ్యాన్స్ లో కంగారు..!
అవినీతి ఆరోపణల కారణంగా సుమంత్ను విధుల్లో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సుమంత్పై కేసు నమోదు చేయాలని సీఎం రేవంత్ స్వయంగా ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి సురేఖ ఇంట్లో ఉన్న సుమంత్ను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన పోలీసులను సురేఖ కుమార్తె సుస్మిత అడ్డుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి సుమంత్ను స్వయంగా కారులో బయటకు తీసుకెళ్లారు సురేఖ. ఆ తర్వాత రేవంత్ రెడ్డిపైన, మంత్రి పొంగులేటి పైన కూడా ఆరోపణలు చేశారు సుస్మిత. తమను తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు. రెడ్డి సామాజిక వర్గం ఓ బీసీ మహిళా మంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రేవంత్ సోదరులకు భద్రత ఎందుకని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. రేవంత్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి కొండా హాజరు కాలేదు. దీంతో తొలగింపు ఖాయమనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది.