ఏపీలో సీనియర్లు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. తాజాగా మరో సీనియర్ నేత రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఒంగోలు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. తన పుట్టిన రోజు సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎంపీ మాగుంట వ్యాఖ్యానించారు. ఒంగోలులో అభిమానుల మధ్య మాగుంట పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సమయంలో మాగుంట తన రాజకీయ భవిష్యత్తుపై వ్యాఖ్యానించారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు మాగుంట శ్రీనివాసుల రెడ్డి.
Also Read : మిధున్ రెడ్డిని రౌండప్ చేసిన సిట్..!
మాగుంట సుబ్బరామిరెడ్డి రాజకీయ వారసునిగా వచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి 1998, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల నాటికి టీడీపీకి రాజీనామా చేసిన మాగుంట వైసీపీలో చేరారు. ఒంగోలు నుంచి పోటీ చేసిన మాగుంట.. మాజీ మంత్రి శిద్దా రాఘవరావుపై ఘన విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట కుమారుడు రాఘవరెడ్డి అరెస్టు అయ్యారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరి ఒంగోలు నుంచి పోటీ చేసి 50 వేల పై చిలుకు ఓట్లతో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఘన విజయం సాధించారు.
Also Read : డేటా సెంటర్ అంటే తెలుసా..? లోకేష్ సెటైర్లు
72వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి.. రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. నిజానికి 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావించినట్లు ప్రకటించిన మాగుంట.. చంద్రబాబు ఆదేశాల మేరకు తప్పని సరి పరిస్థితుల్లో పోటీ చేసినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తనకు బదులుగా తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. తన కుటుంబం నుంచి వస్తున్న రాఘవరెడ్డిని ఆదరించాలని కోరారు. మాగుంట గృహ, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీచేయనని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. కేవలం ఆరోగ్య సమస్యల కారణంగానే ఎన్నికలకు మాగుంట దూరమవుతున్నారు.