అవును.. వీళ్లంతా జర్నలిస్టులు.. నిజాన్ని నిర్భయంగా చెప్పగలరు.. ఇంకా చెప్పాలంటే.. నిజాల కంటే కూడా భజన బాగా చేయగలరనే మాట సరిగ్గా సరిపోతుంది. తెలుగు మీడియాలో సీనియర్ సిటిజన్స్గా గుర్తింపు తెచ్చుకున్నారు. జర్నలిస్టు సంఘాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ప్రభుత్వాలను భయపెట్టగల సమర్థులు కూడా. అయితే ఇదంతా తమ సార్థ ప్రయోజనాల కోసమే అనేది బహిరంగ రహస్యం. పైకి మాత్రం నీతి, నిజాయితీ అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పే ఈ సో కాల్డ్ జర్నలిస్టులు.. పాత్రికేయ వృత్తి ముసుగులో కేవలం ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారు. చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి మాత్రం.. అన్నట్లుగా ఈ పాత్రికేయ పెద్దల తీరు మారిపోయింది. నిజాయితీకి నిలువుటద్దం అన్నట్లుగా పైకి కనిపించే ఈ పెద్దలంతా ఇప్పుడు వైసీపీ అధినేత కోసం తెగ కష్టపడిపోతున్నారు.
అనలిస్టు ముసుగులో అమరావతి మహిళలపైన నీచమైన వ్యాఖ్యలు చేసిన కేసులో కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇదే షోలో మోడరేటర్గా వ్యవహరించిన కొమ్మినేని శ్రీనివాసరావు.. కృష్ణంరాజును వారించకుండా.. నేను కూడా ఈ వార్త చదివాను అంటూ కొనసాగించారు. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరికి చెందిన ఎస్సీ మహిళ ఫిర్యాదు మేరకు కొమ్మినేని, కృష్ణంరాజుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే ఇక్కడే సో కాల్డ్ సీనియర్ పాత్రికేయులంతా ఇప్పుడు లబోదిబో అంటున్నారు. 70 ఏళ్ల సీనియర్ పాత్రికేయునిపై తప్పుడు కేసు పెట్టారని తెగ గగ్గొలు పెడుతున్నారు. పత్రికా స్వేచ్ఛను కూటమి సర్కార్ హరిస్తోందని వాపోతున్నారు కూడా.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చ..!
ఏపీలో పరిణామాల గురించి పక్కరాష్ట్రం తెలంగాణ రాజధాని హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు కొందరు సీనియర్ పాత్రికేయులు. ఏపీలో పత్రికా స్వేచ్ఛ గురించి పక్క రాష్ట్రంలో శ్రీరంగ నీతులు చెబుతున్నారు. అసలింతకీ వీరంతా నిజంగానే జర్నలిస్టులా అంటే.. కాదనే జవాబే వస్తుంది. ఒకరేమో ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించక తన్నులు తప్పించుకుని పారిపోతే.. మరొకరేమో.. పక్క రాష్ట్రం సీఎం చెప్పినట్లు తోక ఆడించి 9 ఏళ్ల పాట్లు క్యాబినెట్ ర్యాంక్ హోదా పదవి అనుభవించారు. ఈ సో కాల్డ్ పాత్రికేయుల గురించే ఇప్పుడు ఏపీలో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వారిలో చాలామంది వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు. తండ్రి, కొడుకుల జమానాలో ప్రభుత్వ పదవులు అనుభవించిన ఘనులే.
సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్కగా పని చేసిన రామచంద్రమూర్తి ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు. జగన్ సర్కార్ మీడియా సలహాదారుగా కూడా పని చేశారు. మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2007లో తీసుకువచ్చిన జీవో నంబర్ 938 గురించి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అంటే.. నో ఆన్సర్. ఇక తెలంగాణ ఉద్యమంలో ఏపీపై విషం చిమ్మిన వ్యక్తి దేవులపల్లి అమర్. టీడీపీ ప్రభుత్వంలో ఫోర్త్ ఎస్టేట్ పేరుతో సాక్షి ఛానల్లో ప్రైమ్ టైమ షో నిర్వహించారు. పత్రికలు ఇష్టం వచ్చినట్లు రాస్తామంటే కుదరదని ప్రెస్ అకాడమీ చైర్మన్ హోదాలో వార్నింగ్ ఇచ్చిన అమర్ను.. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ప్రభుత్వానికి నేషనల్ మీడియా సలహాదారుడిగా నియమించారు. ఆంధ్రులపై విషం చిమ్మిన దేవులపల్లి అమర్.. ఆంధ్రులు కట్టిన పన్నుల నుంచే నెల నెలా లక్షల్లో జీతాలు తీసుకున్నాడు.
Also Read : అక్క ఫోన్ ట్యాప్ చేయించిన అన్న.. షర్మిల వద్ద సంచలన ఆధారాలు
ఇక కేసీఆర్కు అత్యంత నమ్మకస్తునిగా గుర్తింపు తెచ్చుకున్న అల్లం నారాయణ.. ఏకంగా 9 ఏళ్ల పాటు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్గా వ్యవహరించారు. పాత్రికేయులపై కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేసినా.. మీడియాను నిలువునా పాతేస్తా అని వార్నింగ్ ఇచ్చినా కూడా కనీసం పల్లెత్తు మాట అనలేదు. ఇక టీ న్యూస్ ఎడిటర్ శైలేష్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ వార్తలు తప్ప ఏపీ వార్తలు అవసరం లేదని బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా, బీఆర్ఎస్కు అనుకూలంగా మాట్లాడటం ఈయన నేర్చుకున్న పాత్రికేయ నీతి. ఈ ఇద్దరు తెలంగాణ వాదులకు ఏపీలో పత్రికా స్వేచ్ఛ ఎందుకు గుర్తుకు వచ్చిందో తెలియటం లేదంటున్నారు.
సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయ్ రెడ్డి. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై జరిగిన దాడులు, పాత్రికేయుల హత్యలు ధనుంజయ్ రెడ్డికి గుర్తులేవా అని నిలదీస్తున్నారు. సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ను చచ్చేలా కొడితే.. ఎందుకు ధనుంజయ్ రెడ్డి ఖండించలేదని ప్రశ్నిస్తున్నారు. జర్నలిస్టు దీలీప్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వైఎస్ జమానాలో సమాచార హక్కు చట్టం కమిషనర్గా విధులు నిర్వహించారు. సాక్షికి తెర వెనుక, ముందు కూడా దిలీప్ రెడ్డి సేవలు కొనసాగుతున్నాయి. ఇక పత్రికా స్వేచ్ఛ అనేది ఒక వర్గానికి చెందిన అంశం కాదన్న టంకశాల అశోక్ తీరును అంతా తప్పుబడుతున్నారు. అసలు పాత్రికేయ వృత్తిలో వర్గాలు, కులాలు ఎందుకు వస్తాయని ప్రశ్నిస్తున్నారు.
Also Read : మహిళపై దాడి.. డైరెక్ట్ గా ఎస్పీకి చంద్రబాబు ఫోన్
వీరితో పాటు మరో జర్నలిస్టు మేధావి విజయ్ బాబు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రభ ఎడిటర్గా పని చేసిన విజయ్ బాబు.. ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు. ఈ విషయంలో జర్నలిస్టులంతా కలిసి దేహశుద్ధి చేసేందుకు రెడీ అయ్యారు కూడా. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం బాగా అలవాటైన విజయ్ బాబు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ కమిషనర్ పదవి పట్టారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర అధికార భాషా సంఘం ఛైర్మన్ను చేశారు. చంద్రబాబును ద్వేషించడం మాత్రమే వీరి ప్రత్యేక అజెండా. లోపల వ్యక్తిగత అజెండా పెట్టుకుని.. బయటకు మరొక మాదిరిగా వ్యవహరిస్తున్నారు ఈ సో కాల్డ్ జర్నలిస్టులు.