వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుందా… అంటే అవుననే మాటే వినిపిస్తోంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ తాజాగా పులివెందులలో జగన్ పర్యటన. ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చూసిన జగన్కు… ఇప్పుడు చూస్తున్న జగన్కు చాలా తేడా ఉంది అనే మాట ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. జగన్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దారుణంగా తయారైంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వై నాట్ 175 అంటూ గొప్పలకు పోయిన వైసీపీకి చివరికి 11 స్థానాలు మాత్రమే దక్కాయి. జగన్కు ప్రతిపక్ష నేత హోదా కూడా రాలేదు.
ఇక ఓడిన తర్వాత జగన్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సొంత బంధువులు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. నిన్నటి వరకు పొగడ్తలతో ముంచెత్తిన నేతలంతా ఒక్కొక్కరుగా బై బై చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో కుటుంబంలో ఆస్తి తగాదాలు విషయం బయటపడటంతో… జగన్ పరువంతా పోయింది. కన్న తల్లి, సొంత చెల్లి పైనే కోర్టులో కేసు వేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి 70 ఏళ్ల వయసులో ఉన్న తల్లికి కూడా జగన్ నోటీసులు పంపడంపై కుటుంబ సభ్యుల్లోనే వ్యతిరేకత వస్తోంది. ఇక తల్లి విజయమ్మ కూడా కుమార్తె షర్మిలకు అండగా నిలుస్తున్నట్లు లేఖ రాయడం జగన్కు గట్టి ఎదురుదెబ్బ.
రాజకీయాల్లో ఘోర పరాజయం పాలైన జగన్కు కుటుంబ సభ్యులు కూడా దూరమవ్వడంతో దాదాపు ఒంటరిగా మారారు. దయనీయ స్థితిలో పార్టీ… ఛీ కొడుతున్న కుటుంబసభ్యులు… దీంతో భవిష్యత్తుపై జగన్కు భయం పట్టుకున్నట్లుంది. అందుకే గతానికి పూర్తి భిన్నంగా జగన్ ప్రస్తుతం వ్యవహరిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే… ప్రస్తుతం సరికొత్త జగన్ను చూస్తున్నామంటున్నారు పులివెందుల వాసులు. అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు కేవలం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మినహా మిగిలిన కుటుంబ సభ్యులను ఎవరినీ దగ్గరికి రానివ్వలేదు జగన్.
Also Read : తెగించిన నీలి మీడియా.. మళ్ళీ ఫేక్ ప్రచారం
సొంత చెల్లి షర్మిల కాంగ్రెస్లో చేరగా… మరో చెల్లి, వివేకా కుమార్తే డా.సునీత కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. జగన్ ఓటమికి ఇవీ కూడా ఓ కారణాలు. దీంతో తప్పు తెలుసుకున్నట్లున్న జగన్… ప్రస్తుతం మిగిలిన కుటుబ సభ్యులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా సరే… తన దగ్గరకే రావాలన్నట్లుగా నియంతలా వ్యవహరించిన జగన్… ఇప్పుడు మాత్రం… మీరెక్కడ ఉంటే… నేను అక్కడికే వస్తా అంటున్నారు. పులివెందుల పర్యటనలో భాగంగా తన బంధువు వైఎస్ ప్రకాశ్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లారు జగన్. ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు. మీరే మాకు పెద్ద దిక్కు అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మీరంతా నా బలగం అన్నారు.
వాస్తవానికి గతంలో ఎప్పుడు ఇడుపులపాయ వచ్చినా సరే… ఏ బంధువు ఇంటికి వెళ్లిన దాఖలాలు లేవు. కానీ ప్రస్తుతం కుటుంబంలో ఆస్తి తగాదాలు బయటపడటం… షర్మిలకు మద్దతు పెరగడంతో జగన్ ఆత్మరక్షణలో పడినట్లున్నారు. అందుకే ఎంపీ అవినాష్ రెడ్డి, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డితో కలిసి బంధువుల ఇళ్లకు వెళ్లారు. వారితో గంటకు పైగా చర్చించారు. కుశలప్రశ్నలు వేశారు. ఏ అవసరమున్నా సరే… నేనున్నా అంటూ భరోసా కూడా ఇచ్చారు. అయితే జగన్ పలకరింపుల వెనుక రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలున్నట్లు తెలుస్తోంది. తల్లి, చెల్లితో కుటుంబ సభ్యులంతా చర్చించి… తనతో రాజీ కుదుర్చాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా బంధువులను స్వయంగా వాళ్ల ఇళ్లల్లోనే జగన్ కలుస్తున్నారని ప్రస్తుతం వైసీపీలో వినిపిస్తున్న మాట.