ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. క్యారెక్టర్ ఉన్న వాళ్ళను పార్టీలోకి తీసుకుంటాం అని తెలుగుదేశం పార్టీ ప్రకటన చేసిన తర్వాత కొందరు క్యారెక్టర్ ఉందనుకున్న నేతలు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవాలని భావిస్తున్నారు. మాకు క్యారెక్టర్ ఉందని చెప్పుకునే ప్రయత్నం కూడా ఇప్పుడు జరుగుతోంది. ప్రకాశం జిల్లా నుంచి కొందరు నేతలు ఇటీవల మంగళగిరి పార్టీ ఆఫీస్ వద్దకు తమ సన్నిహితులను పంపి రాయబారాలు కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి.
అయితే మంత్రి లోకేష్ మాత్రం కొందరిని వద్దని చెప్పారని అందుకే చంద్రబాబు ఆలోచిస్తున్నారని ప్రచారం జరిగింది. అందులో మాజీ మంత్రి సిద్దా రాఘవరావు ఒకరు. సిద్దా ప్రస్తుతం వైసీపీ నుంచి బయటకు వచ్చేందుకు నానా కష్టాలు పడుతున్నారు. చంద్రబాబు వద్దకు రాయబారం పంపినా ఆయన చేరిక ఆలస్యం అవుతోంది. ప్రకాశం జిల్లాలో ఆయన సౌమ్యుడు అనే పేరు ఉంది గాని పార్టీ మారడంతో అధిష్టానం ఇప్పుడు దృష్టి పెట్టలేకపోతుంది. గ్రానైట్ మైనింగ్ సంస్థల పై జగన్ సర్కార్ భారీగా జరిమానా విధించడంతో పోరాటం చేయలేక, వ్యాపారాల కోసం సిద్దా పార్టీ మారిన విషయం అందరికి అవగాహన ఉంది.
Read Also : శభాష్ మంత్రులు.. మీరందరూ రియల్ హీరోలే
వ్యాపారాల కోసం చాలా మందిని ఇబ్బంది పెట్టారు అప్పట్లో. అందులో గొట్టిపాటి రవికుమార్ కూడా ఉన్నారు. ఆయన అన్నీ తట్టుకుని నిలబడ్డారు. కాని సిద్దా మాత్రం వెంటనే లొంగిపోయారు. దీనితో అధిష్టానం ఆయన విషయంలో అంతగా ఆసక్తి చూపించడం లేదు. అటు బిజెపిలోకి గాని, జనసేన లోకి గాని వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నా టీడీపీ ఆపుతుంది అంటున్నారు. అందుకే వరద సహాయం పేరుతో చంద్రబాబుని కలిసారు సిద్దా. ఈ సందర్భంగా చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు దాదాపు మూడు గంటలు ఎదురు చూసారు. చంద్రబాబు కలవకపోవడంతో తిరిగి వెళ్ళిపోయారు.
ఈ సందర్భంగా వరదల తర్వాత మాట్లాడదాం అని చంద్రబాబు చెప్పారనే వార్తలు వచ్చాయి. అందుకే కొన్నాళ్ళు విజయవాడలోనే మకాం వేయాలని సిద్దా ప్లాన్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. శిద్దాతో పాటుగా వైసీపీ నుంచి మరింతమంది నాయకులు టీడీపీ చేరాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి వీరి విషయంలో టీడీపీ అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందో, ఏమి చేస్తుందో చూడాలి. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది.




