రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన మదనపల్లె ఆర్డీవో ఆఫీస్ దహనం కేసుకి సంబంధించి ఇప్పుడు ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో అధికారులు కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఏకంగా డీజీపీని హెలికాప్టర్ లో చంద్రబాబు ఘటనా స్థలానికి పంపడం అప్పుడు సంచలనంగా మారింది. ఇక ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పేరు ప్రముఖంగా వినపడుతుంది. ఇది ప్రమాదం కాదు కుట్ర అనే విషయం ఇప్పటికే క్లారిటీ కూడా వచ్చింది.
ఫైళ్ల దహనం ఘటనపై నాగ్పూర్ నుంచి నేషనల్ ఫోరెన్సిక్ సైన్సు ల్యాబ్ నిపుణులు వచ్చి ఘటన జరిగిన ప్రాంతంలో కాలిపోయి మిగిలిన అవశేషాల శాంపిల్స్ తీసుకున్నట్లు తెలిసింది. ఇక షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించలేదని విద్యుత్ సేఫ్టీ అధికారులు ఎంఆర్ఐ (మీటర్ రీడింగ్ ఇన్స్ట్రుమెంట్) డేటా విశ్లేషించి ప్రభుత్వానికి, పోలీసులకు ఇప్పటికే నివేదిక పంపించారు. అగ్ని మాపక సిబ్బంది, అధికారులు వచ్చే సమయానికి మంటలు పెద్ద ఎత్తున వ్యాపించినట్టు గుర్తించారు. దానికి కారణం ఏంటీ అనే దానిపై విచారణ ముమ్మరం చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మంటలు వేగంగా వ్యాపించేలా హైలీ ఇన్ఫ్లేమబుల్ రసాయనాలైన గ్యాసోలిన్, పెయింట్ తిన్నర్, టర్పెంటైన్, శానిటైజర్, పెట్రోల్, స్పిరిట్ వాడి ఉండవచ్చు అని గుర్తించారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులో ఈ విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో బలమైన కేసులు పెడుతున్నట్టు తెలుస్తోంది. కాస్పరసి సెక్షన్ 120-బి (కూడగట్టుకుని నేరం చేసిన) కింద కేసు నమోదు చేసారు. నేరం జరిగినప్పుడు అది బయటకు రాకుండా వారికి సహకరించిన, సాక్ష్యాలు, ఆధారాలు చెరిపేందుకు, దాచిపెట్టేందుకు ప్రయత్నించిన వారిపై ఈ కేసులు నమోదు చేస్తారు. పది రోజుల్లో ఎఫ్ ఎస్ ఎల్ నివేదిక వచ్చిన తర్వాత కీలక అరెస్ట్ లు ఉండే అవకాశం ఉంది.