తొలిసారి ప్రభుత్వంలో భాగం కావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా దూకుడుగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. జనసేన పార్టీ మంత్రులు సైతం ఎక్కడా అలసత్వం ప్రదర్శించడం లేదు. తమ శాఖల్లో జరిగిన అవినీతి అక్రమాలను కూడా ఆ మంత్రులు గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వాటి మీద ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు మాజీ ఎమ్మెల్యేల అవినీతి లక్ష్యంగా పవన్ కళ్యాణ్ కొన్ని శాఖలను టార్గెట్ చేసారు.
అందులో ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ ఒకటి. ఈ శాఖలో భారీగా అక్రమాలు జరిగాయని పవన్ ఇప్పటికే తన మంత్రి నాదెండ్ల మనోహర్ ద్వారా తెలుసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కాకినాడ పోర్ట్ నుంచి భారీగా రేషన్ బియ్యం విదేశాలకు అక్రమ రవాణా జరిగిందని గుర్తించారు. నాదెండ్ల మనోహర్ దాదాపు 20 రోజుల నుంచి ఇదే పని మీద ఉన్నారు. నిన్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం కాకినాడ వెళ్ళిన పవన్ కళ్యాణ్… నాదెండ్ల మనోహర్ తో పాటుగా స్థానిక అధికారులను కూడా రేషన్ బియ్యం గురించి వివరాలు అడిగారట.
ఇందులో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కొడాలి నానీ సహకారంతో భారీగా అక్రమాలు జరిగాయని, కొందరు అధికారులు వారి కోసం పని చేసారని గుర్తించారు. దీనితో ఈ అంశానికి సంబంధించి ఒక నివేదిక సిద్దం చేసి చంద్రబాబు వద్దకు మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్ళే అవకాశం కనపడుతోంది. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా ఫోకస్ పెట్టడంతో సిఐడీ విచారణకు చంద్రబాబు ఆదేశించే సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ వ్యవహారంలో కొడాలి నానీ, ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డిలను త్వరలోనే విచారణకు పిలవనున్నారని తెలుస్తోంది.