తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అనే సామెత ప్రస్తుతం టీడీపీలో కొందరు నేతలకు సరిగ్గా సరిపోతుంది. గతంలో అధికారం అనుభవించిన నేతలు.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం వదిలేసి వెళ్లిపోయారు. మళ్లీ అధికారంలోకి వస్తుందని భావించి సరిగ్గా ఎన్నికల ముందు పార్టీలో చేరి… ఇప్పుడు పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో టీడీపీ నేతల పైనే తిరుగుబాటు జెండా ఎగిరేస్తున్నారు. అలాంటి వారిలో మాజీ మంత్రి పాలేటి రామారావు ఒకరు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం నుంచి 1994, 1999 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1999 చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.
Also Read: ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యావు జగన్..?
ఆ తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడారు. ఆ తర్వాత నుంచి రాజకీయాలకు దూరమయ్యారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మారారు పాలేటి. ద్వితీయ శ్రేణి నేతగా వైసీపీలో కొనసాగారు పాలేటి. చీరాల నుంచి టీడీపీ తరఫున గెలిచిన కరణం బలరాం పార్టీ మారటం.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా చీరాల నియోజకవర్గానికి చెందిన నేత కావడంతో… పాలేటికి పెద్దగా గుర్తింపు రాలేదు. కరణం, ఆమంచి, పోతుల గ్రూప్లతో విభేదించిన పాలేటి రామారావు… గ్రూప్ రాజకీయాలకు తెరలేపారు. దీంతో ఐదేళ్లు వైసీపీలో అసంతృప్త నేతగానే మిగిలిపోయారు.
Also Read: ఏపి మంత్రులకి బాబు ర్యాంకింగ్.. లోకేష్, పవన్ ఎక్కడంటే..?
సరిగ్గా ఎన్నికల సమయంలో వైసీపీకి రాజీనామా చేసిన పాలేటి రామారావు.. హడావుడిగా తెలుగుదేశం పార్టీలో చేరారు. చేరిన వెంటనే టికెట్ కావాలని కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ… సీఎం చంద్రబాబు మాత్రం.. మాలకొండయ్య యాదవ్కు టికెట్ ఇచ్చారు. దీంతో మరోసారి పాలేటి గ్రూప్ రాజకీయాలకు తెర తీశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిరోజుల పాటు సైలెంట్గా ఉన్న పాలేటి రామారావు… ఇప్పుడు మరోసారి తన మార్క్ పాలిటిక్స్కు తెర లేపారు. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్కు వ్యతిరేకంగా గ్రూప్ రాజకీయాలు నడిపిస్తున్నారు. ఎంఎం కొండయ్య పనితీరు బాగోలేదంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం నడిపిస్తున్నారు.
Also Read: ఎమ్మెల్యే గారి వైసీపీ ప్రేమ.. కృష్ణా జిల్లాలో అలజడి..!
వైసీపీ నేతలతో కలిసి టీడీపీ వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా చీరాల గడియా స్తంభం సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు వైసీపీ కౌన్సిలర్లతో కలిసి భూమి పూజ చేశారు పాలేటి రామారావు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించిన పార్టీ నేతలతో భూమి పూజ ఎలా నిర్వహిస్తారని ఆగ్రహించిన తెలుగు తమ్ముళ్లు… ఆ ప్రాంతంలో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేశారు. వైసీపీ నేతలతో కలిసి టీడీపీని దెబ్బ తీయాలని పాలేటి ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నారు. పాలేటి తీరుపై ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా చేశారు. పాలేటి రామారావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాలేటి రామారావు పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అన్న చర్చ చీరాలలో నెలకొంది.