30 ఏళ్ళ పాటు ప్రతిపక్షం లేకుండా పాలన చేయాలని భావించిన వైఎస్ జగన్ ఇప్పుడు అసలు ప్రతిపక్ష పార్టీ అని కూడా చెప్పుకోలేని పరిస్థితికి క్రమంగా దిగజారుతున్నారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పార్టీలో అవకాశం ఉంటే ఆ పార్టీలోకి కొందరు నేతలు వెళ్ళిపోవాలని చూడడటం వైఎస్ జగన్ ను ఇబ్బంది పెట్టె అంశం. తనకు ఇబ్బంది లేదని 5 ఏళ్ళ పాటు నిలబడితే అధికారం మనదే అని జగన్ ఎన్ని విధాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా సరే అది సాధ్యం కావడం లేదు. పార్టీ నేతలు ఆయన మాటలను నమ్మడం లేదు.
తాజాగా జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే మోపిదేవి వెంకట రమణ పార్టీ మారిపోతున్నారు. మోపిదేవి ముందు నుంచి జగన్ వెంటే ఉన్నారు. ఆయన కోసం జైలు జీవితాన్ని కూడా మోపిదేవి గడిపారు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో పోటీ చేయాలని మోపిదేవి భావించినా రేపల్లె సీటుని మరొకరికి కేటాయించారు జగన్. దీనిపై మోపిదేవి బహిరంగంగానే అసహనం వ్యక్తం చేసారు. అందుకే ఆయన ఎన్నికల్లో పని చేయలేదు, ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పార్టీ కోసం పని చేసేందుకు ఆసక్తి చూపించలేదు.
వాస్తవానికి రేపల్లె తీర ప్రాంతంలో ఆయనకు మంచి పట్టు ఉంది. కాని జగన్ ఆయనను కాదని మరొకరికి సీటు ఇచ్చారు. ఇదే విభేదాలకు కారణం అయింది. తాజాగా పార్టీ మార్పుపై మోపిదేవి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డికి నాకు విభేదాలు ఉన్నాయని అన్నారు. ఆ విభేదాల గురించి నేను బయటకు చెప్పలేనని జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి నచ్చకే పార్టీకి పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నాను అని స్పష్టం చేసారు. నేను చూడని అధికారం… పదవులు లేవు అన్నారు. అధికారం కోసం నేను టిడిపిలో చేరడం లేదు అని ఆక్టివ్ పాలిటిక్స్ లో ఉండాలని నేను అనుకుంటున్నాను అని ఆయన పేర్కొన్నారు.
టిడిపి అధికారంలో ఉంది చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరనే ఉద్దేశంతోనే టిడిపిలో జాయిన్ అవుతున్నాను అని స్పష్టం చేసారు. జగన్ ప్రజలకు సంక్షేమం అందించారు కానీ అభివృద్ధిని గాలికి వదిలేశారు అన్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు బేరీజు వేసుకుంటూ పాలన సాగించాలి కాని జగన్ అలా చేయలేదు అని విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపులకు జగన్ దిగారు అన్నారు. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు కూడా మేమందరం వద్దని చెప్పాం అని మా మాటను జగన్ లెక్క చేయలేదు సంచలన వ్యాఖ్యలు చేసారు. నిరంకుశ ధోరణితో జగన్ వ్యవహరించారు అని మండిపడ్డారు.