ఆంధ్రప్రదేశ్ లో మరో భారీ స్కాం వెలుగులోకి రానుందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. నిన్న టిడీఆర్ బాండ్ల వ్యవహారంలో అంతర్గత విచారణ జరుగుతుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒరిజనల్ అసైనీలకు లబ్ది చేకూర్చేందుకే ఫ్రీ హోల్డ్ చేసిన అసైన్డ్ భూముల రిజిస్ర్టేషన్లు మూడు నెలల పాటు నిలిపివేసామని చెప్తూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన విషయాలు బయటపెట్టారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు కుట్ర పూరితంగా ఎస్ సీ, ఎస్టీల అసైన్డ్ భూములను చౌకగా కొట్టేశారు అని ఆయన పేర్కొన్నారు.
అసైన్డ్ చట్టానికి సవరణ వస్తుందని ముందే తెలుసుకొని వైసీపీ నేతలు ఒరిజనల్ అసైనీల నుండి అతి తక్కువ ధరలకే భూములను కొనేశారు అన్నారు. కొన్ని ప్రభుత్వ భూములను కూడా నిషేధిత జాబితా నుండి ఫ్రీ హోల్డ్ చేశారు అని ఆయన పేర్కొన్నారు. ప్రజా అవసరాలకు ఉంచిన ప్రభుత్వ భూములను ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ర్టేషన్లు చేశారు అన్నారు. రిజిస్టర్ అయిన అసైన్డ్ భూముల్లో కొన్ని నిబంధనలకు విరుద్దంగా గిఫ్ట్ డీడ్లుగా చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అని మంత్రి మీడియా సమావేశంలో వివరించారు.
20 ఏళ్ల పరిమితి దాటని భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేసినట్లు సమాచారముంది అన్నారు ఆయన. ఫ్రీ హోల్డ్ వ్యవహారంలో జరిగిన తప్పులన్నింటీని సరిచేసేందుకే మూడు నెలల పాటు రిజిస్ర్టేషన్లు నిలిపివేశామని పేర్కొన్నారు. ఒరిజనల్ అసైనీలకు వందకు వంద శాతం పూర్తి న్యాయం చేస్తాం అని స్పష్టం చేసారు. ఫ్రీ హోల్డ్ పేరుతో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని మంత్రి అనగాని స్పష్టం చేసారు. ఏది ఏమైనా గత ప్రభుత్వంలో జరిగిన భారీ అవినీతిని ఆధారాలతో సహా వెలికితీస్తున్న బాబు సర్కార్ కి ప్రజలు అభినందనలు తెలియచేస్తున్నారు. ఇలా చేసినప్పుడే అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.




