దశాబ్దాలుగా పీడిత ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న మావోయిస్టు పార్టీ ప్రస్థానం తుది దశకు చేరుకున్నది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ లోపే అనుకున్న లక్ష్యాన్ని కేంద్ర హోం శాఖ సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోనీ దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ ఉనికి క్రమంగా కనుమరుగవుతుంది.
Also Read : పాత చంద్రబాబును చూడబోతున్నామా.. క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం..?
దాదాపు నాలుగు రోజుల్లో 300 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. శుక్రవారం ఒక్కరోజే మావోయిస్టు పార్టీ చరిత్రలో 208 మంది మావోయిస్టులు లొంగిపోవడం సంచలనం. మావోయిస్టు అగ్ర నేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్లపల్లి వాసుదేవరావ్ సహా కీలక నేతలు లొంగిపోయారు. దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీలు, బస్తర్ డివిజన్ లో అగ్ర నేతలు అందరూ తుడిచిపెట్టుకుపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టు ఉద్యమాన్ని ముందుకు నడిపించడం సాధ్యం కాదని భావిస్తున్న అగ్ర నేతలు కూడా లొంగుబాటు మేలని భావిస్తున్నారు.
Also Read : చైనా వర్సెస్ ట్రంప్.. ఏం జరుగుతోంది..?
మావోయిస్టు అగ్రనేత బసవరాజు మరణంతో ఆ పార్టీ మానసికంగా దెబ్బతింది. వరుసగా సెంట్రల్ కమిటీ సభ్యులను భద్రత బలగాలు కాల్చి చంపటం కూడా మావోయిస్టు పార్టీనీ కలవర పెట్టింది. ఎక్కువ కాలం సాయుధ పోరాటం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చిన మావోయిస్టులు.. జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వస్తున్నారు. త్వరలోనే మరి కొంతమంది అగ్ర నేతలు కూడా పోలీసుల సమక్షంలో లొంగిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఛత్తీస్గడ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో దూకుడు ప్రదర్శించడంతో మావోయిస్టులు ముఖ్యమంత్రులు సమక్షంలోనే.. తుపాకీలను వీడుతున్నారు. దాదాపు రాబోయే రెండు మూడు నెలల్లో మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే గడ్చిరోలి, ఉత్తర బస్తర్ జిల్లాల్లో మావోయిస్టులు పూర్తిగా కనుమరుగైనట్లు కేంద్ర హోం శాఖ ప్రకటించింది.