ఎన్నికల్లో ఘన విజయం సాధించామన్న విజయ గర్వం తెలుగుదేశం పార్టీ నేతల్లో ఏమాత్రం కనిపించటం లేదు. పార్టీ గెలుపు కోసం ఎంతో శ్రమించిన నేతలు సైతం ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే అధినేత చంద్రబాబు పార్టీ గెలుపుపై ఫోకస్ పెట్టారు. పార్టీలో కిందిస్థాయి కార్యకర్తలతో కూడా మమేకం అయ్యారు.. జిల్లాల్లో పర్యటించారు. అలాగే వారంలో నాలుగు రోజులు తప్పనిసరిగా పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు.
అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ తీరు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. యువగళం పాదయాత్ర చేశారు. స్థానిక సమస్యలు తీరుస్తామంటూ హామీ ఇచ్చారు. అయితే మూడేళ్లుగా మంగళగిరి కేంద్ర కార్యాలయానికి రావడానికి మాత్రం చినబాబుకు సమయం లేకుండా పోయింది. పార్టీ నేతలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలనేది అధినేత ఆదేశం. అందులో భాగంగానే పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. ఓ మంత్రి, పార్టీ సీనియర్ నేతతో పాటు అనుబంధ సంఘాలకు చెందిన నేతలు కూడా ఉండాలన్నారు.
Also Read :బాబు సర్కార్ కి కాసుల వర్షం
అలాగే ప్రతి శనివారం స్వయంగా పార్టీ కార్యాలయానికి వచ్చి స్వయంగా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అయితే మంత్రి నారా లోకేష్ మాత్రం పార్టీ కార్యాలయం వైపు రావటం లేదు. పైగా ఇంటి దగ్గర విడిగా ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. కిందిస్థాయి కార్యకర్త మొదలు జాతీయ స్థాయి నేత వరకు.. ఎవరైనా సరే లోకేష్ ను కలవాలంటే ఉండవల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లాల్సిందే. అంతే తప్ప మంగళగిరి ఆఫీస్ వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు.
పార్టీ కార్యాలయాన్ని తెలుగు తమ్ముళ్లు దేవాలయంగా భావిస్తారు. అందుకే వైసీపీ మూకలు పార్టీ కార్యాలయంపై దాడి చేసిన తర్వాత ఆవేదనకు గురయ్యారు. దాడికి నిరసనగా చంద్రబాబు దీక్ష చేస్తున్న సమయంలో మేమంతా మీ వెంటే అంటూ తోచినంత సాయం కూడా చేశారు. ఎన్టీఆర్ భవన్ అంటే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ఓ భరోసా. కానీ అలాంటి కేంద్ర కార్యాలయానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాకపోవడం పై నేతలు చర్చించుకుంటున్నారు. మరి ఈ అనుమానాలకు, పుకార్లకు చెక్ పెట్టాలంటే.. ఇకనుంచి చినబాబు పార్టీ ఆఫీసుకు రావాల్సిందే.