ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ విషయంలో దూకుడుగా ఉంది. కీలక వ్యక్తులను విచారిస్తూ వస్తోంది సిట్. ఈ తరుణంలో మాజీ సిఎం వైఎస్ జగన్ ఓఎస్డీ గా పని చేసిన కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలపై గురి పెట్టింది. వారిని అరెస్ట్ చేసుకోవచ్చు అంటూ సుప్రీం కోర్ట్ కూడా స్పష్టం చేసిన నేపధ్యంలో తాజాగా హైకోర్ట్ లో కీలక విచారణ జరిగింది. వీరి బెయిల్ పై హైకోర్ట్ విచారించగా.. వాదనల సందర్భంగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
Also Read : కూటమి సర్కారుపై జగన్ ముఠా మరో కొత్త వ్యూహం..!
ఇరు వర్గాల వాదనలు ముగియగా తీర్పును ఏపీ హైకోర్ట్ వాయిదా వేసింది. ఐఏఎస్ ధనుంజయ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు ఒకసారి చూస్తే.. ఎక్సైజ్ పాలసీ ప్రభుత్వం మారినపుడు మారిందని.. ఎక్సైజ్ పాలసీ మార్పు జరగటంతో ఆరోపణలు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రభుత్వంలో పని చేశారు కాబట్టి ఆరోపణలు చేసారని.. ఎటువంటి ఆధారాలు సేకరించకుండా నిందితుడిగా చేర్చారని ఆవేదన వ్యక్తం చేసారు. ముందస్తు బెయిల్ కి అర్హులు అని.. డిస్టలరీస్ కి లబ్ది చేకూర్చినట్టు కూడా ఆరోపణలు చేస్తున్నారని కోర్ట్ ముందు వాదించారు.
Also Read : మరో ఐఏఎస్ అరెస్టు ఖాయం..!
కృష్ణమోహన్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు చూస్తే.. మొదట ఎఫ్ ఐ ఆర్ లో తన పేరు లేదని.. పాలసీ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వమని.. అప్పటి సీఎం ఓఎస్డీ గా పనిచేసినా లిక్కర్ వ్యవహారంలో ఎక్కడా ఆదేశాలు ఇవ్వలేదని.. ప్రభుత్వ పెద్దలే ఆదేశాలు ఇచ్చారు అంటూ వాదించారు. కేసీరెడ్డి రిమాండ్ రిపోర్టు లో మాత్రం పేరు రాశారని.. ప్రాథమికంగా ఆధారాలు లేవన్నారు కృష్ణ మోహన్ రెడ్డి లాయర్. లిక్కర్ సెల్స్, సప్లై, ఆదాయం ఇలా ఎక్కడా ఆదేశాలు లేవు, పాత్ర లేదని.. తనకు ఏ సంబంధం లేదని, కాబట్టి బెయిల్ ఇవ్వాలని వాదించారు.