రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ళ పంచాయితీ ఇప్పట్లో ముగిసే సంకేతాలు కనపడటం లేదు. కృష్ణా నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల వాటా విషయంలో స్పష్టత రావడం లేదు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఎన్ని సమావేశాలు నిర్వహించినా సరే ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అటు కేంద్రం జోక్యం చేసుకున్నా సమస్య పరిష్కారం మాత్రం కనపడటం లేదు. తాజాగా కృష్ణా రివర్ బోర్డ్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు పాల్గొనగా… బోర్డు కీలక వ్యాఖ్యలు చేసింది.
Also Read : పండుగనాడు కూడా ప్రాంతీయ విద్వేషమేనా కవితక్కా..?
శ్రీశైలం నాగార్జునసాగర్ లలో ఉన్న నీటిని రెండు రాష్ట్రాలు వివాదాలు లేకుండా సామరస్యంగా పంచుకోవాలని బోర్డు దిశా నిర్దేశం చేసింది. మొదటగా తాగునీటి అవసరాలకు ప్రయారిటీ ఇవ్వాలని రెండు రాష్ట్రాలకు బోర్డు సూచించింది. పంటల సాగు కీలక దశలో ఉన్నందున.. అవసరానికి అనుగుణంగా వృధా కాకుండా నీటిని వాడుకోవాలని సూచించింది. ఎవరికి ఎంత అవసరం ఉంటుందో ప్రతీ 15 రోజులకు ఒకసారి భేటీ కావాలని బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం సాగర్ నుంచి ఏపీ 7 వేల క్యూసెక్కులు, తెలంగాణ 9 వేల క్యూసెక్కుల వాటర్ డ్రా చేసుకుంటున్నాయి.
Also Read : జీవీ రెడ్డికి అధిష్ఠానం పిలుపు.. పదవి ఖాయమా..?
శ్రీశైలం నుంచి ఏపీ 2, 200 క్యూసెక్కుల నీటిని ఏపీ తీసుకుంటుంది. శ్రీశైలం నుంచి తెలంగాణ కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,400 క్యూసెక్కులు డ్రా చేస్తోంది. రెండు ప్రాజెక్టు లలో ఉన్న 70 టీఎంసీ లను వేసవి వరకు పొదుపుగా వాడుకోవాలని బోర్డు సూచించింది. తాగునీటికి ప్రాధాన్యం ఇస్తూనే పంటలను కాపాడుకునేలా ప్రణాళికతో వెళ్లాలని బోర్డు స్పష్టం చేసింది. వచ్చే 15రోజులు కీలకం , నీటికోసం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్రాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.