పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ముందుగా మార్కాపురం, మదనపల్లె, ఆదోని, పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఎంపిక చేసింది. పీపీపీ విధానంలో నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనేది ప్రభుత్వం ఆలోచన. దీని వల్ల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుతాయనేది చంద్రబాబు మాట కూడా. అయితే పీపీపీ విధానాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై కోటి సంతకాల సేకరణ పేరుతో ఇటీవల రాష్ట్ర గవర్నర్కు లేఖ కూడా అందించారు.
Also Read : రాజు గారి తీరుతో కూటమిపై విమర్శలు..!
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించి, నిర్వహించేందుకు ఎవరు ముందుకు వచ్చినా సరే.. తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో చర్యలు తీసుకుంటామన్నారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. టెండర్ వేసిన వారిని అరెస్టు చేస్తామని కూడా బెదిరించారు జగన్. ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం కూడా రేపాయి. పారిశ్రామిక వేత్తలను జగన్ బెదిరిస్తున్నారని కూటమి నేతలు విమర్శలు కూడా చేశారు. ఇక పీపీపీ విధానానికి కేంద్రంలో ఓకే చెప్పి.. రాష్ట్రంలో మాత్రం అడ్డుకుంటున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సత్యకుమార్ అయితే.. ముందు ప్రధాని మోదీని, తర్వాత తనను అరెస్టు చేయాలని సవాల్ కూడా విసిరారు.
Also Read : కోహ్లీని చూస్తే చాలనుకున్నా.. కానీ.. తెలుగు క్రికెటర్ సంచలన కామెంట్స్
ఇక ఈ టెండ్ ప్రక్రియ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. నాలుగు కాలేజీల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానిస్తే.. ఆదోని కోసం మాత్రం ఒక్కటే సంస్థ టెండర్ దాఖలు చేసిందని.. మిగిలిన మూడు కాలేజీలకు ఒక్కరు కూడా టెండర్ వేయలేదనే వార్తలు వెలువడ్డాయి. ఆదోని మెడికల్ కాలేజీ కోసం కిమ్స్ సంస్థ టెండర్ వేసిందనే వార్త బాగా వైరల్ అయ్యింది. దీనిపై కిమ్స్ సంస్థ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. పీపీపీల టెండర్ ప్రక్రియలో కిమ్స్ ఆసుపత్రి పాల్గొనట్లేదని యాజమాన్యం ప్రకటించింది. అసలు మెడికల్ కాలేజీల పీపీపీ వేలంలో పాల్గొనలేదని తేల్చి చెప్పారు. ఆదోని మెడికల్ కళాశాల కోసం టెండర్ వేశామన్న వార్తలు అవాస్తవమని కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటనలో స్పష్టం చేసింది. దీంతో అధికారులు ఇలా ఎందుకు సీఎంకు సమాచారం ఇచ్చారన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

