అందరూ పరారవుతున్నారు.. చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకుంటున్నారు. పరారవుతున్న నేతలకు పోలీసు శాఖలో కిందిస్థాయి యంత్రాంగం ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోంది. ఒంగోలు నుంచి పోలీసు బృందం ఇలా బయలు దేరగానే.. అలా రాంగోపాల్ వర్మకు తెలిసిపోయింది. ఆంధ్రప్రదేశ్లో పలు కీలక కేసుల్లో నిందితులు పరారవుతున్నారు. వీరిని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోతున్నారనేది ఇప్పుడు కూటమి నేతలు వేస్తున్న ప్రశ్న. ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియాకు కీలకంగా వ్యవహరించిన సజ్జల భార్గవరెడ్డి, అర్జున్రెడ్డితో పాటు, మరికొందరు కూడా పరారీలో ఉన్నారు.
Also Read: వర్మను దాచిన హీరో ఎవరు…?
వీరు కాకుండా విచారణకు హాజరు కావాలని ప్రకాశం జిల్లా పోలీసులు రాంగోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. కానీ ఆర్జీవీ మాత్రం పరారీలో ఉండటంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక పులివెందులలో వర్రా రవీంద్రారెడ్డిపై నమోదైన కేసుల్లో… సంబంధం ఉన్న పలువురు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు విచారణ చేసి.. 41ఏ నోటీసులు ఇచ్చి పంపించారు. ఇక మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయలేదు. మహబూబ్నగర్ జిల్లాలో దొరికినట్లే దొరికి తప్పించుకొని పారిపోయాడు. వెంకట్రామిరెడ్డి తప్పించుకునేందుకు పోలీసులు ఇస్తున్న సమాచారమే కీలకంగా పని చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: బాబు టార్గెట్ అదే… బీ కేర్ ఫుల్..!
వెంకట్రామిరెడ్డి హైదరాబాద్లోనే దర్జాగా తిరుగుతున్నాడనేది టీడీపీ నేతల ఆరోపణ. న్యాయపరమైన రక్షణ పొందేవరకు పోలీసులు ఇలాంటి వారిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పని చేసిన పోలీసులే ఇప్పుడు కూడా ఉన్నారని, కనీసం అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు కూడా చేయడం లేదని చెబుతున్నారు. మరోవైపు కొంతమంది పోలీసు అధికారులు ప్రభుత్వాన్ని లెక్క చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులు సస్పెన్షన్ అయినప్పటికీ ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నట్లుగా సవాల్ విసురుతున్నారు.
Also Read: మరో మాజీ ఎమ్మెల్యేకి ఎర్త్ పెట్టిన బాబు సర్కార్
ముంబై నటి జెత్వాని కేసుతో పాటు రఘురామకృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ కేసులో నిందితుడిగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు కనీసం ముందస్తు బెయిల్ దరఖాస్తు చేయలేదు. థర్డ్ డిగ్రీ కేసులో సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్కుమార్ ముందస్తు బెయిల్ కోసం వెళ్లలేదు. జెత్వాని కేసులో ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, అప్పటి డీసీపీలు, మరో న్యాయవాది ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై హైకోర్టులో విచారణ జరగనుంంది. సాక్షాత్తు పోలీసు అధికారులే ప్రభుత్వాన్ని సవాల్ చేసే దశలో ఉన్నారని.. పోలీసు యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని కూటమి కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు ప్రశ్నిస్తున్నారు.
Also Read: ఆ పదవుల భర్తీ ఎప్పుడు బాబు గారు..?
వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ధూళిపాళ్ళ నరేంద్ర వంటి నేతలను అర్ధరాత్రి గోడలు దూకి అరెస్ట్ చేశారు. అయితే అప్పట్లో నిబంధనలు పాటించకుండా వ్యవహరించిన పోలీసులు.. ఇప్పుడు నిబంధనల పేరుతో సాకులు చెబుతున్నారని కూటమి పక్షాలు ఆరోపిస్తున్నాయి.