పదేళ్లు అధికారం అనుభవించిన కేసీఆర్ను ఇప్పుడు నాటి తప్పిదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టులే ఇప్పుడు కేసీఆర్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తెలంగాణలో కీలకమైన ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్, బీజేపీ నేతలు తొలి నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. వీటిల్లో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు… దీని ద్వారా తెలంగాణ వ్యాప్తంగా సాగు నీరు అందించవచ్చని కేసీఆర్ ప్రకటించారు. ఏకంగా రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసింది కేసీఆర్ సర్కార్. అదే సమయంలో కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమల దివ్యక్షేత్రానికి ప్రత్యామ్నాయంగా తెలంగాణలో యాదగిరిగుట్టను కేసీఆర్ పునర్నిర్మించారు. ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.300 కోట్లు పైగా ఖర్చు చేశారు. అయితే ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టులే కేసీఆర్ను ఇక్కట్ల పాలు చేస్తున్నాయి.
Also Read : చంద్రబాబు సంచలన నిర్ణయం..!
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని తొలి నుంచి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే దాదాపు 8 ఏళ్ల పాటు ప్రాజెక్టు చుట్టుపక్కలకు కూడా ఎవరినీ రానివ్వకుండా కట్టడి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఎన్నికలకు సరిగ్గా 4 నెలల ముందు అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లు కుంగిపోవడంతో దీనిపై పెద్ద దుమారమే రేగింది. చివరికి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత అవినీతి తీగ లాగేందుకు రేవంత్ సర్కార్ నడుం బిగించింది. ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ కమిషన్ను నియమించింది. పలువురు అధికారులను విచారించిన ఈ కమిషన్ ఇప్పటికే రిపోర్టును సీఎంకు అందించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని… ఇప్పటికే తెలుస్తోంది.
ఇక మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం. తిరుమలకు ధీటుగా యాదగిరిగుట్టను అభివృద్ధి చేయాలనేది బీఆర్ఎస్ సర్కార్ ప్లాన్. ఇందుకోసం పక్కనే ఓ కొండ కూడా తయారు చేశారు. ఆర్ట్ డైరెక్టర్తో గుడిని రూపొందించారు. అయితే ఆలయ నిర్మాణ సమయంలోనే ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఆలయ స్తంభాలపైన కారు, కేసీఆర్ గుర్తులుండటాన్ని బీజేపీ, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో అవి తొలగించారు. ఇక తాజాగా ఆలయ మాఢవీధుల్లో నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. మాఢవీధి కుంగిపోయింది. పిల్లర్ల మధ్య పగుళ్లు ఏర్పడ్డాయి.
Also Read : అలా మన తెలుగు హీరోలు చేయలేరా…?
అత్యంత పవిత్రమైన నారసింహుని దివ్యక్షేత్రం నిర్మాణంలో ఈ తరహా అవకతవకలు బయటపడటాన్ని భక్తులు తప్పుబడుతున్నారు. భారీ ఖర్చుతో నిర్మించిన ఆలయంలో ఇలా నాసిరకమైన పనులు చేశారని ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో యాదాద్రి ఆలయ నిర్మాణంపై నివేదిక ఇవ్వాలని ఇప్పటికే అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ అంశం ఇప్పుడు కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలను కలవరపెడుతోంది.